corona update : ఇండియాలో లక్ష దాటిన కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకు చేరువలో
భారత్లో కరోనా మహమ్మారి చాలా వేగంగా విస్తరిస్తుంది . ఒకపక్క లాక్ డౌన్ 4.0 అమలవుతుంది. మరోపక్క కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు కూడా ఇస్తున్నాయి . ఇక దీంతో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నాటికి భారత్లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇక ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా కేసులు 50 లక్షలకు చేరువలో ఉన్నాయి.
కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా
భారత్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,01,139
ఇప్పటివరకూ భారత్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,01,139కి చేరగా, మృతుల సంఖ్య 3,163కు చేరింది. ఇక కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకు 39,173 మంది పూర్తిగా కోలుకోగా, దేశంలో ప్రస్తుతం 58,802 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక మహారాష్ట్ర కరోనా పాజిటివ్ కేసుల్లో టాప్ పొజీషన్ లో ఉంది . ఇప్పటివరకు మహారాష్ట్రలో 35,058 కేసులు నమోదు కాగా 25,372 యాక్టివ్ కేసులు ఉన్నాయి .ఇప్పటివరకు 8,437 కేసులు రికవర్ కాగా 1,249 మంది మృతి చెందారు .
లాక్ డౌన్ సడలింపులతో పెరుగుతున్న కేసులు
బీహార్లో ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వలస కార్మికుల నుండి తీసిన 835 నమూనాలలో 218 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలింది . ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 కొనసాగుతున్నా వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వస్తున్న నేపధ్యంలో కొంత కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కూడా వేగంగా పెరుగుతున్న పరిస్థితి . కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 48 లక్షల 90 వేలకు చేరిన కేసులు
ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 48 లక్షల 90 వేలకు చేరింది. తాజా లెక్కల ప్రకారం 3 లక్షల 19 వేల మంది కరోనాకు బలయ్యారు. 17 లక్షల 70 వేల మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 26 లక్షల 69 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కేసుల సంఖ్య 15 లక్షల 44 వేలు దాటిందని తెలుస్తుంది . అక్కడ మొత్తంగా మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. రష్యాలోనూ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది . అక్కడ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉండగా, 2 వేల ఏడు వందల మంది కరోనాకు ఇప్పటివరకు బలయ్యారు.