కరోనా వాక్సీన్ కనిపెట్టడంలో అమెరికా ముందంజ..! అన్నీ కలిసొస్తే వారంలో అందిస్తామంటున్న యూఎస్..!!
వాషింగ్టన్/హైదరాబాద్ : కరోనా వైరస్ ఎంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిందో అంతే తొందరగా దాన్ని తరిమికొట్టాలని ప్రపంచంలోని అగ్ర దేశాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ముందు వరసలో ఉన్న దేశాలన్నీ వాక్సీన్ కనుగొనేందుకు పోటీ పడుతున్నాయి. ఏదేశం ముందుగా తయారు చేస్తే ఆదేశానికి మంచి గుర్తింపు వస్తుంది కాబట్టి అగ్ర దేశాలన్ని వాక్సీన్ తయారీ ప్రయోగాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంలో అగ్ర రాజ్యమైన అమెరికా ఇతర దేశాలకన్నా ఓ అడుగు ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. వాక్సీన్ తయారీలో ప్రయోగాలు విజయవంతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని, అన్ని అనుకూలిస్తే ఓ వారం పది రోజుల్లో ప్రపంచ దేశాలకు కరోనా వాక్సీన్ అందిస్తామని అమెరికా భరోసా ఇస్తోంది.
Recommended Video
కరోనా వాక్సీన్ తయారీలో అమెరికా ముందంజ.. వారంలో మందు రెఢీ అంటోన్న యూఎస్..
ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే వాక్సిన్ రెడీ కాబోతోందని సభ్య దేశాలకు అమెరికా శుభవార్త వినిపిస్తోంది. అమెరికాలో టెక్సాన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో కరోనా వాక్సీన్ పరిశోధన చివరి ఘట్టానికి చేరుకుందని శాస్త్రవేత్తలు నిర్దారిస్తున్నారు. వారం రోజుల లోతైన పరిశీలన తర్వాత ఈ వాక్సిన్ కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రించగలదా లేదా అనే అంశం పట్ల స్పష్టత వస్తుందని తెలుస్తోంది. కరోనా వైరస్ను తట్టుకునేలా మానవుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ వైరస్ ప్రయోగాలను టెక్సాస్లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తొలి దశలన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో తుది దశ ప్రయోగాల కోసం యూనివర్సిటీ ప్రయోగశాల సిద్దమవుతోంది.
సత్తా చాటుకుంటున్న అగ్ర దేశం.. ప్రయోగాల్లో ఆశాజనక అడుగులు..
అయితే తుది దశలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ఆరోగ్యంతో ఉన్న అన్ని వయో పరిమితుల వ్యక్తులు ముందుకు రావాలని ఈ యూనివర్సిటీ పిలుపునిస్తోంది. మనుషులపై ఆరోగ్య పరీక్షలు, వాక్సిన్ ప్రయోగాలను నిర్వహించేందుకు అన్ని రకాల చట్ట బద్దమైన అనుమతులు పొందిన ఏకైక యూనివర్సిటీ ఏ అండ్ ఎం కావడం విశేషం. ఇప్పటి వరకు పరిశోధనలు నిర్వహిస్తున్న వాటిలో ఒక్క ఏ అండ్ ఎం యూనివర్సిటీకి మాత్రమే ఫెడరల్ పర్మిషన్స్ వచ్చాయంటే వారి ప్రయోగాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా ఈ శాస్త్ర వేత్తలు చేస్తున్న ప్రయోగాల మీద మొదటి నుండీ అమెరికా మీడియా పెద్ద ఎత్తున వ్యాసాలు రాస్తున్నవారు.
అన్ని అనుమతులు పొందిన టెక్సాస్ యునివర్సిటీ.. నాలుగో దశలో ప్రయోగం..
అంతే కాకుండా బీసీజీ వాక్సిన్తో కరోనా వైరస్ను పూర్తిగా నియంత్రించ లేకపోయినప్పటికీ, దాన్ని చాలా వరకు నిరోధించవచ్చని ఏ అండ్ ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశదీకరిస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్లోను బీసీజీ వాక్సిన్ను వినియోగిస్తున్న విషయాన్ని వారి గుర్తు చేస్తున్నారు. బీసీజీని మరికొంత మెరుగుపరచడం ద్వారా కరోనాకు వాక్సిన్ రూపొందిస్తున్న విషయం వారు వివరిస్తున్నారు. తుది దశ విజయవంతం అయితే, కనీసం ఆరు నెలల్లో వాక్సిన్ రెడీ అవుతుందని ఏ అండ్ ఎం వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే అంశాన్ని అమెరికా మీడియా స్పష్టం చేస్తోంది. ఇక అన్నీ అనుకూలిస్తే అగ్ర రాజ్యమైన అమెరికా కరోనా వాక్సీన్ తయారీలో కూడా తన్న సత్తా చాటుకుందనే చర్చ జరగడం ఖాయమని తెలుస్తోంది.
కరోనా వైరస్ వాక్సీన్ తయారీలో అనేక దేశాల పోటీ.. ముందు వరుసలో ఉన్న అమెరికా..
ప్రస్తుతం ఎఫ్.డీ.ఏ. అనుమతులు లభించినందువల్ల తొలి మూడు దశల ప్రయోగాలు ఇక అవసరం లేదని, ఏకంగా నాలుగో దశ ప్రయోగాలనే ఈ వారంలో ప్రారంభిస్తామని అమెరికా శాస్త్రవేత్తలంటున్నారు. ప్రయోగాలు ప్రారంభించిన వారం రోజుల్లోనే వాక్సిన్ పనితీరు, శాస్త్రీయత ఏంటో తేలిపోతుందని వారు చెబుతున్నారు. కరోనా వాక్సిన్ ప్రయోగాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీకి రెండున్నర మిలియన్ డాలర్ల ఆర్థిక ప్రోత్సాహం లభించనున్నట్టు తెలుస్తోంది. అటు డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వ ప్రోత్సాహం, ఇటు ఇతర సంస్థల ఆర్థిక వెసులు బాటుతో కరోనా వ్యాక్సీన్ తయారీలో ముందుడుగు వేస్తామనే ధీమాలు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే వారం పది రోజుల్లో కరోనా వాక్సీన్ ప్రపంచ దేశాల ముందుంచుతామని చెప్పుకొస్తున్నారు.