కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : కేంద్రం , ప్రధాని మోడీపై విరుచుకుపడిన సోనియా గాంధీ , మమతా బెనర్జీ
కోవిడ్ వ్యాక్సిన్ ధరల వ్యత్యాసంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి . ఇప్పటికే రాహుల్ గాంధీ , తెలంగాణా మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తే తాజాగా సోనియా గాంధీ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం మోడీ సర్కార్ పై మండిపడ్డారు.
కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : జిఎస్టీ విధానంతో లింక్ , కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన మంత్రి కేటీఆర్ !!
ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు, "ప్రజల కష్టాల నుండి ఇటువంటి చెత్త లాభాలను భారత ప్రభుత్వం ఎలా అనుమతించగలదు?" అని ప్రశ్నించారు . వ్యాక్సిన్ పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వివక్షా పూరితంగా, పక్షపాతంతో కూడుకుని ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు గల పౌరులకు వ్యాక్సిన్లు ఉచితంగా అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లు అర్థమవుతోందని సోనియా గాంధీ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే విధానం : సోనియా గాంధీ
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన కోవిడ్ -19 వ్యాక్సిన్ ధరల జాబితాను విడుదల చేసిన ఒక రోజు తరువాత సోనియా గాంధీ నిప్పులు చెరిగారు . కేంద్రం యొక్క సవరించిన టీకా విధానాన్ని తిరిగి అంచనా వేయాలని ,వ్యాక్సిన్లకు ఒకే విధంగా ధరను నిర్ణయించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
పీఎంకు రాసిన లేఖలో, సోనియా గాంధీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రానికి మోతాదుకు రూ .150, కాని రాష్ట్ర ప్రభుత్వానికి ₹ 400 మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించటం వెనుక అర్థం పౌరులు బలవంతంగా అధిక రేట్లు చెల్లించాలనేనా అని ప్రశ్నించారు . ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని అన్నారు .
ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇచ్చే వ్యాక్సిన్ కోసం ఒక ధర ఉండదా? మమతా బెనర్జీ ఫైర్
ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రం లేదా రాష్ట్రం ఎవరు చెల్లించినా ఒకే ధరను నిర్ణయించి వ్యాక్సిన్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వందల రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలు ధరగా నిర్ణయించగా, ఈ నిర్ణయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భగ్గుమన్నారు .
ఒక దేశం, ఒక పార్టీ, ఒక నాయకుడు అని ఎల్లప్పుడూ అరిచే బిజెపి నాయకులు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇచ్చే వ్యాక్సిన్ కోసం ఒక ధర ఉండదా అని ప్రశ్నించారు . భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని , వారి వయస్సు, కులం, మతం, ప్రదేశంతో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రం లేదా రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఒకే ధర నిర్ణయించాలి : మమతా బెనర్జీ
కేంద్రం లేదా రాష్ట్రాలతో సంబంధం లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ధరను నిర్ణయించాలని బెనర్జీ గురువారం ట్వీట్ చేశారు. టీకా ప్రక్రియను వికేంద్రీకరించాలని మరియు ఎక్కువ మందికి టీకాలు వేయడానికి వీలుగా వయో పరిమితిని ఎత్తివేయాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తరువాత, అందరికీ వ్యాక్సిన్కు అర్హత ఉంటుందని కేంద్రం ప్రకటించింది . మే 1 నుండి మార్కెట్ ద్వారా వ్యాక్సిన్ డోసులు అమ్మవచ్చని ప్రకటించింది.
వ్యాక్సిన్ ధరల మధ్య వ్యత్యాసంపై ప్రతిపక్షాలు ఫైర్
కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీదారులకు తమ టీకాను భారతదేశంలో బహిరంగ మార్కెట్లో ముందుగా నిర్ణయించిన రేటుకు విక్రయించడానికి కేంద్రం సోమవారం అనుమతించడంతో సీరం సంస్థ వ్యాక్సిన్ ధరలను ప్రకటన చేసింది. ధరల మధ్య వ్యత్యాసం ఇప్పుడు కేంద్రాన్ని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేయడానికి కారణంగా మారాయి.
One nation, one party, one leader shouts BJP all the time but to save lives they can’t have one price for vaccine.
— Mamata Banerjee (@MamataOfficial) April 22, 2021
Every Indian needs free vaccine, regardless of age, caste, creed, location. GoI must fix ONE price for Covid vaccine irrespective of who pays— Centre or the States.