corona virus: కర్ణాటకలో 1, కేరళలో 2..107కి చేరిన పాజిటివ్ కేసులు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో మరో పాజిటివ్ కేసు నమోదు కాగా.. కేరళలో రెండు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 107కి చేరుకున్నాయి. ఇప్పటికే ఇద్దరు చనిపోవడంతో భయాందోళన నెలకొంది. 12 రాష్ట్రాల్లో ప్రభావం చూపడంతో.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, జనసమ్మర్ధం ఉన్న చోట ప్రజలు గుమికూడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య ఆదివారంతో 6 వేలకు చేరింది.
కర్ణాటకలోని గుల్బార్గా జిల్లాకు చెందిన ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని వైద్యులు పేర్కొన్నారు. ఇటు దైవభూమి కేరళలో కూడా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు కాగా.. వాటి సంఖ్య 21కి చేరుకున్నది. ఇద్దరిలో ఒకరు బ్రిటన్ నుంచి మరొకరు విదేశాల నుంచి వచ్చారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇటు యూపీలో కూడా మరొ పాజిటివ్ కేసు రికార్డైంది. ఆగ్రాలో నమోదైన కేసుతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. లక్నోలో కోచింగ్ సెంటర్లను ఈ నెల 22వ తేదీ వరకు క్లోజ్ చేస్తామని స్పష్టంచేసింది.
Recommended Video
జమ్ముకశ్మీర్లో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు రెస్టారెంట్లు మూసివేస్తున్నామని జమ్ము జిల్లా పరిపాలన విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ షూటింగ్ ఈ నెల 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. స్కూళ్లు, జిమ్, థియేటర్లు, నైట్ క్లబ్సులు మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.