ఆవుపేడలో పుట్టి పెరిగా .. నాకు కరోనా రాదు .. ఆ మంత్రి వ్యాఖ్యలు వైరల్
కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి ఇది చేయండి, అది చేయండి అని మార్కెట్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ ను తీసుకుంటే కరోనా రాదు అని చెప్తున్నారు. ఆల్కహాలు తాగడంతో కూడా కరోనా దరిచేరదని కొందరు ప్రచారం చేస్తున్నారు. వెల్లుల్లి రసం, వేడినీరు తీసుకోవడం మంచిదని కొందరంటుంటే, నిమ్మరసం, పసుపు, కషాయాలు కరోనా నుండి కాపాడతాయని మరికొందరు చెబుతున్నారు.
కరోనా కల్లోలం .. ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలు దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణ
కరోనా నుండి కాపాడే పాపడ్ లు, ఇమ్యూన్ బూస్టింగ్ డ్రింక్స్ తో పాటు, ఇమ్యూనిటీని పెంచే ఆయుర్వేద బిర్యానీలు,వ్యాధి నిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్స్ పేరుతో ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఏది పడితే అది నమ్మి ఇతర సమస్యలు కొని తెచ్చుకోవద్దని వైద్యులు చెప్పిన పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి ఇమార్తీ దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికిపోతుంటే ఆమె తనను కరోనా వైరస్ దరిచేరదు అంటూ గ్వాలియర్ లో విలేఖరులు అడిగిన ప్రశ్నకు వింత సమాధానమిచ్చారు .
Recommended Video
తాను మట్టి, ఆవు పేడలో పుట్టి పెరిగిన దాన్నని, కరోనా వైరస్ తన దరిదాపులకు కూడా రాదని ఆమె వ్యాఖ్యానించారు.తనకు కరోనా వైరస్ సోకిందని ఒక విలేఖరి అబద్ధపు వార్త రాయడంపై మండిపడిన ఆమె ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఆవు పేడ,మట్టిలో పుట్టి పెరిగితే కరోనా రాదా అన్న చర్చ మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున జరుగుతోంది.