Coronavirus: కర్ణాటక సరిహద్దు జిల్లాలు హైఅలర్ట్: చైనా నుంచి స్వస్థలానికి: 51 మందికి పరీక్షలు.. !
బెంగళూరు: కరోనా వైరస్ ప్రభావం కర్ణాటకపై పడింది. రెండు కేసులో పాజిటివ్గా తేలిన కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న జిల్లాల్లో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ను ప్రకటించింది. సరిహద్దు గ్రామాలు, పట్టణాలపై నిఘా ఉంచాలని జిల్లా పాలనా యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసింది. వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా చర్యలను చేపట్టాలని సూచించింది.
కరోనా వైరస్ బారిన పడిన తరువాత చైనా నుంచి 51 మంది కన్నడిగులు స్వస్థలాలకు తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా 44 మందికి రక్తనమూనాలను సేకరించారు. వారిని వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.
రక్త నమూనాలను పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. వాటిలో 26 కేసులు నెగిటివ్గా తేలాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మరి కొన్ని నమూనాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని చెప్పారు.
కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న కొడగు, మంగళూరు, చామరాజనగర, మైసూరు జిల్లాల్లో హైఅలర్ట్ను ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో స్టేట్ సర్వైలెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. కేరళ నుంచి కర్ణాటకకు రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా ఉండటంతో.. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. కేరళలో ఇప్పటికే రెండు కేసులు పాజిటీవ్గా తేలాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారిపై నిఘా ఉంచారు.