Coronavirus: సీఎం సొంత ఇలాఖాలో పెళ్లికి చెక్, క్వారంటైన్ లో 19 పోలీసులు, ఏం జరిగిందంటే ?
బెంగళూరు/ శివమొగ్గ: లాక్ డౌన్ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మైనర్ బాలిక పెళ్లి జరిపించడానికి ఆమె కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం సొంత ఇలాఖాలో మైనర్ బాలిక పెళ్లి జరిగిందని ప్రచారం జరిగితే మొదటికే మోసం వస్తుందని భావించిన పోలీసులు ఆ పెళ్లిని అడ్డుకున్నారు. మైనర్ బాలికను రక్షించి పోలీసు జీపులో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే ఈ తతంగం మొత్తం జరిగిపోయిన తరువాత పోలీసు శాఖ ఉలిక్కిపడింది. ఏసీపీ, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, ఎస్ఐలు ఇలా మొత్తం 19 మంది పోలీసు అధికారులు ఇప్పుడు కరోనా క్వారంటైన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం రాత్రికి రాత్రే సీఎం సొంత జిల్లాలోని పోలీసు అధికారులు అందర్నీ బదిలి చేశారు. మైనర్ బాలిక పెళ్లి అగిపోవడానికి, ఇంత మంది పోలీసు అధికారులు క్వారంటైన్ కు వెళ్లడానికి ఓ లింక్ ఉంది.
Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !
సీఎం సొంత అడ్డాలో మైనర్ పెళ్లి !
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత నియోజక వర్గం శికారీపుర (శివమొగ్గ జిల్లా) తాలుకాలోని తరలఘట్ట గ్రామంలో మైనర్ బాలిక పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. సీఎం బీఎస్. యడియూరప్ప సొంత నియోజక వర్గంలో మైనర్ బాలిక పెళ్లి జరిగిందని బయటకు తెలిస్తే రచ్చరచ్చ అవుతుందోని తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు శికారీపుర గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇన్స్ పెక్టర్ ఎంట్రీతో మైనర్ పెళ్లికి చెక్ !
విషయం తెలుసుకున్న శికారీపుర ఇన్స్ పెక్టర్, ఒక ఎస్ఐతో పాటు కొందరు పోలీసులు తరలఘట్ట గ్రామానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కుమార్తె మైనర్ అని వెలుగు చూసింది. వెంటనే తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చిన ఇన్స్ పెక్టర్ బాలికను పోలీసు జీపులో తీసుకెళ్లి శివమొగ్గ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. తరువాత ఆ బాలికను శివమొగ్గలోని సురభి సఖి కేంద్రానికి తరలించారు.
కొంప ముంచిన లాక్ డౌన్ మీటింగ్
కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తీసుకోవాలసిన చర్యలపై శివమొగ్గ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివమొగ్గ జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మైనర్ బాలికను రక్షించిన ఇన్స్ పెక్టర్ సైతం ఈ మీటింగ్ కు హాజరైనారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీటింగ్ పూర్తి కావడంతో పోలీసు అధికారులు ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు. తరువాత అసలు కథ మొదలైయ్యింది.
హలో.... రిజల్ట్ వచ్చిందని ఫోన్ !
శివమొగ్గలోని సురభి సఖి కేంద్రానికి వెళ్లిన మైనర్ బాలికకు దగ్గు, జ్వరం రావడంతో ఆమెకు వారం రోజుల క్రితం వైద్యపరీక్షలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం బాలిక వైద్యపరీక్షలు నివేదిక వచ్చింది. అంతే వైద్య శాఖ అధికారులు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి హల్ సర్, బాలిక వైద్యపరీక్షల నివేదిక వచ్చింది, ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చిందని చెప్పడంతో పోలీసు అధికారులు షాక్ కు గురైనారు. అప్పటికే జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ కు అమ్మాయిని తీసుకువచ్చిన ఇన్స్ పెక్టర్ రావడంతో పోలీసు అధికారులు హడలిపోయారు.
కరోనా క్వారంటైన్ లో 19 మంది
మైనర్ బాలికకు కరోనా పాజిటివ్ అని రావడం, ఆ అమ్మాయిని తీసుకెళ్లిన ఇన్స్ పెక్టర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీటింగ్ కు వెళ్లడంతో పోలీసు అధికారులు హడలిపోయారు. మంగళవారం రాత్రి ఒక ఏఎస్పీతో పాటు ఐదు మంది డీఎస్పీలు, 12 మంది సీఐలుతో పాటు సురభి సఖి కేంద్రానికి వెళ్లి వచ్చిన ఎస్ఐలు, పోలీసులు, సురభి కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగులు అందరూ ఇప్పుడు క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇంత మంది పోలీసు అధికారులు ఒక్కసారిగా క్వారంటైన్ కు వెళ్లడంతో రాత్రికి రాత్రి 19 మంది పోలీసు అధికారులు శివమొగ్గ జిల్లాకు బదిలి అయ్యారు. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప సొంత ఇలాఖాలో అందరూ ప్రస్తుతం కొత్త పోలీసు అధికారులు దర్శనం ఇస్తున్నారు.