నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19)నుంచి ప్రజలను రక్షించడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా కాటుకు దూరం కావాలంటే లాక్ డౌన్ కు దేశ ప్రజలు సహకరించాలని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు. కరోనా వైరస్ ఎంత భయంకరమైనదో అని చాటి చెప్పడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నానా తిప్పులు పడుతున్నాయి. అయితే నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు వచ్చి అరెస్టు చెయ్యండి, నా దగ్గరకు వస్తే మీ కథ క్లోజ్, నాతో పాటు మీ ప్రాణాలు పోతాయని అంటూ పోలీసులకు సవాలు విసిరాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. బెంగళూరు పోలీసులు ధైర్యం చేసి ప్రాణాలకు తెలిగించి పట్టుకున్న యువకుడి అసలు స్టోరీ బయటపడటంతో అతన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపించారు.
Coronavirus: ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి, ప్రాణాలతో ఉంటే వంద ఉగాదులు, సరేనా !
బెంగళూరు పోలీసులు
ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో స్థానిక పోలీసులు కరోనా వైరస్ ఎంత భయంకరమైన వ్యాధి అనే విషయం ప్రజలకు చెబుతున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా బెంగళూరు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోలీసులు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారికి కాపలాకాస్తున్నారు.
యశవంతపురంలో ఏం జరిగిందంటే ?
బెంగళూరు నగరంలోని యశవంతపురం సోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు కరోనా వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసు వాహనాలకు మైకులు ఏర్పాటు చేసి కరోనా వైరస్ కు దూరం కావాలంటే మీరు ఇళ్లలోనే ఉండాలని, ప్రతి గంటకు ఒక సారి చేతులు శుభ్రం చేసుకోవాలని, ముఖాలకు మాస్కులు వేసుకోవాలని, పుకార్లను నమ్మకూడదని, ప్రభుత్వ సూచనలు పాటించాలని చెబుతున్నారు.
కరనా వచ్చిందని ఇంజనీరింగ్ విద్యార్థి హంగామా
యశవంతపురం 1వ మెయిన్ రోడ్డులో రాత్రి పోలీసులు ప్రజల్లో చైతన్యంతీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న ఇంజనీరింగ్ చదివే ఓ యువకుడు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి కేకలు వేశాడు. నువ్వు ఇంటి లోపలికి వెళ్లాలని పోలీసులు చెప్పినా అతను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డు మీద నానా హంగామా చేశాడు.
నాకు కరోనా వచ్చింది, నా దగ్గరకు వస్తే చస్తారు !
పోలీసుల మాటలను పెడచెవిన పెట్టిన ఇంజనీరింగ్ విద్యార్థి నాకు కరోనా వచ్చింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పాడు. పోలీసులు అతని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తే మీరు నాదగ్గరకు వస్తే మిమ్మల్ని ముట్టుకుంటాను, తరువాత మీరు నాతోపాటు చస్తారు అంటూ బెదిరించాడు. అయితే పోలీసులు ప్రాణాలకు తెగించి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కు బానిస, పిచ్చాసుపత్రిలో సెటిల్
బెంగళూరు పోలీసులు ఇంజనీరింగ్ విద్యార్థిని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. అయితే అతనికి కరోనా వైరస్ లక్షణాలు ఏమాత్రం లేవని, డ్రగ్స్ సేవించడం వలనే ఇంత హంగామా చేశాడని వైద్యులు తేల్చిచెప్పారు. పోలీసులకు మండిపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థి మీద కేసు నమోదు చేసి అతన్ని పిచ్చాసుపత్రికి తరలించారు. అనవసరంగా కరోనా వైరస్ వచ్చిందని తిక్కతిక్క చేష్టలు చేస్తే ఇలాగే పిచ్చాసుపత్రికి పంపిస్తామని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు.