Coronavirus: సామాన్య ప్రజల కోసం తక్కువ ధరకే ఫేస్ సీల్డ్ రెఢీ, వైరస్ పరార్, మైసూరులో !
బెంగళూరు/ మైసూరు: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా సోకిన వారికి చికిత్స చేయడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేసే వైద్య సిబ్బంది భద్రతా పరికరాల కొరతను ఎదుర్కొంటున్నారు. బాగా అమర్చిన వ్యక్తిగత భద్రతా పరికరాలు లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది సైతం కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఉండటంతో వారిలో ఆందోళన ఎక్కువ అయ్యింది. మాస్క్ లు, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్స్ వంటి వైద్య భద్రతా పరికరాల కొరత చాల ఎక్కువగా ఉంది. ఈ కొరతను గ్రహించిన మైసూర్కు చెందిన తయారీ సంస్థ ఆర్ పిఎం మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ అతి తక్కువ సమయంలో చక్కటి పరిష్కారాన్ని కనుగొనింది. కేవలం ఐదు రోజుల్లో 90% తక్కువకు పునరుత్పాదక పదార్థాలు ఉపయోగించి ఫేస్ షీల్డ్స్ను మైసూరుకు చెందిన ఆర్ పీఎం కంపెనీ తయారు చేసింది. వైద్య సిబ్బందితో పాటు సామాన్య ప్రజల కోసం ఫేస్ సీల్డ్ లు తయారు చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !
మైసూరు ఆర్ పీఎం కంపెనీ
కర్ణాటకలోని మైసూర్ నగరంలోని స్టార్టప్ కంపెనీ దేసిక్ ల్యాబ్స్ మొదట ఆర్ పీఎం కంపెనీ మేనేజ్మెంట్ బోర్డును కలుసుకుని ప్రస్తుతం దేశంలో ఫేస్ షీల్డ్ అవసరం ఎంతుందో అనే విషయంపై చర్చించింది. ఫేస్ సీల్డ్ లు తయారు చెయ్యాలని ఆర్ పీఎం కంపెనీకి ప్రతిపాదించింది. సాంప్రదాయ ముఖ కవచాలు (ఫేస్ సీల్డ్ లు) తయారు చెయ్యడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని ఇదే సమయంలో చర్చ జరిగింది. ఆర్ పీఎం కంపెనీ పాలకవర్గం ఫేస్ సీల్డ్ తయారీ ఖర్చులను తగ్గించడానికి సిద్దం అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫేస్ షీల్డ్ల ధర చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫేస్ సీల్డ్ లు తయారు చెయ్యడానికి ఉపయోగించిన పదార్థాలన్నీ చాలా ఖరీదైనవి. ఖర్చులు తగ్గించడానికి మరియు డిజైన్తో ముందుకు రావడానికి ఆర్ పిఎం కంపెనీ చాలా మార్పులు చేసింది. ఆర్ పీఎం కంపెనీ కేవలం ఐదు రోజుల్లో చాలా తక్కువ ఖర్చుతో ఫేస్ సీల్డ్ లు తయారు చేసింది.
6 నిమిషాల్లో సిద్దం
ప్రస్తుతం కొన్ని కంపెనీలు తయారు చేస్తున్న ఫేస్ సీల్డ్ లకు ఉపయోగించే పదార్థాలకు భిన్నంగా మైసూరులోని ఆర్ పీఎం కంపెనీ వేరే పదార్థాలు ఉపయోగించి ఫేస్ సీల్డ్ లు తయారు చేస్తోంది. వ్యవసాయ వ్యర్థాలు, వెదురు ఫైబర్, బియ్యం తదితర పదార్థాలతో ఫేస్ సీల్డ్ లు తయారు చేస్తున్నది. ఫ్లాస్టిక్, కార్బన్ వాడకం చాలా వరకు తగ్గించింది. కొన్ని కంపెనీలు 3D ఫ్రింట్ తో ఫేస్ సీల్డ్ లు తయారు చేస్తున్నాయి. అయితే మైసూరులోని ఆర్ పీఎం కంపెనీ ఫేస్ సీల్డ్ లు తయారు చెయ్యడానికి అచ్చులు ఉపయోగిస్తున్నది. కొన్ని కంపెనీలు ప్రస్తుతం 3D ప్రింటింగ్ తో తయారు చేస్తున్న ఫేస్ సీల్డ్ లు తయారు చెయ్యడానికి 20 నిమిషాలు పడుతోందని, మా కంపెనీ కేవలం 6 సెకన్లలో ఫేస్ సీల్డ్ లు చేస్తున్నదని ఆ కంపెనీ ప్రతినిధిలు అంటున్నారు.
డిప్యూటీ కమిషనర్ గ్రీన్ సిగ్నల్
మైసూరు డిప్యూటీ కమిషనర్ అభిరామ్ జి. శంకర్ ను ఆర్ పీఎం కంపెనీ ప్రతినిధులు కలిశారు. డిప్యూటీ కమిషనర్ అభిరామ్ జి. శంకర్ అనుమతి తీసుకున్న తరువాత కంపెనీలో ఫేస్ సీల్డ్ లు తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యామని ఆర్ పీఎం కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మూడు రోజుల పాటు ఫ్యాక్టరీలో ఆర్ పీఎం కంపెనీ వ్యవస్థాపకుడు హేమంత్ కుమార్, కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాకేష్ పటేల్ మాకేరి అక్కడే ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఫేస్ సీల్డ్ లతో పోల్చితే ఇక్కడ తయారు చేసిన ఫేస్ సీల్డ్ నాణ్యంగా ఉన్నాయని అంటున్నారు. ఆర్ పీఎం కంపెనీ తయారు చేసిన ఫేస్ సీల్డ్ లకు కేవలం షీట్లు మాత్రమే మార్చ వలసి ఉంటుందని, క్లిప్ లు చాలా సార్లు ఉపయోగించడానికి అవకాశం ఉందని హేమంత్ కుమార్, రాకేష్ పటేల్ మాకేరి వివరించారు.
మార్కెట్ ధరల్లో ఎంతో తేడా
ప్రస్తుతం మార్కెట్ లో ఫేస్ సీల్డ్ లు ఆ కంపెనీల బ్రాండ్ లకు ఉన్న డిమాండ్ తో రూ. 100 నుంచి రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. అయితే మైసూరులోని ఆర్ పీఎం కంపెనీ తయారు చేసిన ఫేస్ సీల్డ్ లు కేవలం రూ. 35 విక్రయించడానికి సిద్దం అయ్యింది. డిమాండ్ ఎక్కువ పెరిగితే ఉత్పత్తి ఎక్కువ అవుతోందని, అప్పుడు ఇంకా ధర తగ్గే అవకాశం ఉందని ఆర్ పీఎం కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 8 వేల ఫేస్ సీల్డ్ లు తయారు చేస్తున్నామని, వచ్చే వారం రోజుల్లో 20 వేల ఫేస్ సీల్డ్ లు తయారు చెయ్యాలని అంచానా వేస్తున్నామని, తరువాత రోజుకు 80 వేల ఫేస్ సీల్డ్ లు తయారు చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.