Coronavirus:అదో నిశ్శబ్ద నగరం... వూహాన్ నగరంకు వెళ్లిన విమానంలోని పైలట్ అనుభవాలు
చైనాతో పాటు ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ వైరస్ అక్కడి చాలామంది ప్రాణాలను తీసింది. ఇక వూహాన్ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు విమానాలను పంపి వారిని ఢిల్లీకి చేర్చింది. ఇక ఈ విమానంలోని ఓ పైలట్ చైనాలోని పరిస్థితిని వివరించారు.
భారతీయులను రక్షించేందుకు బోయింగ్ 747 విమానం
వూహాన్ కేంద్రంగా బయటపడ్డ కరోనావైరస్ ఆ తర్వాత దీని బారిన పడి కొన్ని వేల మంది ఇప్పటికే మృతి చెందారు. వూహాన్ నగరంలో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా రెండు విమానాలను పంపి వారిని ఢిల్లీకి తీసుకొచ్చింది. అయితే వూహాన్ నగరం మొత్తం కర్ఫ్యూలాంటి పరిస్థితులు ఉన్న క్రమంలో ఈ ఎయిరిండియా విమానం అక్కడ ల్యాండ్ అయ్యింది. ఫిబ్రవరి 1న బోయింగ్ 747 విమానం వూహాన్ నగరంలో ల్యాండ్ అయి 324 మంది భారతీయులను వెనక్కు తీసుకొచ్చింది. మరో విమానం 323 మంది భారతీయులతో పాటు 7 మంది మాల్దీవులకు చెందిన వారిని తీసుకొచ్చింది.
ఈ ఆపరేషన్ నిర్వహించింది కెప్టెన్ అమితాబ్ సింగ్
ఇక ఈ విమానం ఆపరేషన్స్ను నిర్వహించింది సీనియర్ పైలట్ అమితాబ్ సింగ్. తన అనుభవాలను ఆయన పంచుకున్నారు.అసలు వూహాన్ నగరంలో వివమానంను ఎలా మానిటర్ చేశారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వివరించారు అమితాబ్ సింగ్. ఇక ఏదైనా అత్యవసర మిషన్ల కోసం ఎప్పుడూ ఒక టీమ్ రెడీగా ఉంటుందని అమితాబ్ చెప్పారు. వూహాన్ నగరంలో చిక్కుకున్న వారిని భారత్కు తీసుకురావాలని తనకు సమాచారం ఇచ్చినప్పుడు వెంటనే ఆ టీమ్లోని సభ్యులందరికీ ఫోన్ చేసి రప్పించామని చెప్పారు. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్పినట్లు వెల్లడించారు.ఇక్కడ అతిపెద్ద సవాలు ఏంటంటే ఈ విమానంలో ప్రయాణించే సిబ్బందికి వీసా తీసుకురావడం కాస్త కష్టంగా మారిందని చెప్పారు. కానీ చివరికి అది సాధ్యమైందని వెల్లడించారు. జనవరి 31వ తేదీ మధ్యాహ్నం విమానం బయలుదేరాల్సి ఉండగా చాలామందికి ఉదయం 7 గంటల సమయంలో వీసాలు వచ్చాయని చెప్పారు.
ముందస్తు జాగ్రత్తలు
వూహాన్ నగరంకు బయలు దేరాలంటే ఎవరైనా సిబ్బంది రాలేమని చెప్పారా.. అని ప్రశ్నించగా... అలాంటిదేమీ లేదని అందరూ ఓకే చెప్పారని అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేదానిపైన మాత్రమే స్పష్టత కోరారని అమితాబ్ సింగ్ చెప్పారు. వెంటనే ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతో ఇక మిషన్ ప్రారంభించామని చెప్పారు. సాధారణ ప్రయాణికులను ఎకానమీ సెక్షన్లో కూర్చోబెట్టాలని, డాక్టర్లను ఇంజినీర్లను ఫస్ట్క్లాస్ క్యాబిన్లో కూర్చోబెట్టాలని, మిగతా సిబ్బంది మొత్తం అప్పర్ డెక్లో ఉంచాలని ముందుగా నిర్ణయించామని చెప్పారు. ఇక వైరస్ ఉన్న ప్రాంతం కాబట్టి ప్రయాణికులతో ఎక్కువగా మాట్లాడకూడదని భావించి వారికి కావాల్సిన ఆహారం, వాటర్ బాటిల్స్ ముందుగానే సీట్లలో ఉంచామని చెప్పారు. ఇక జనవరి 31 మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 747 విమానం 34 మంది సిబ్బంది, నలుగురు పైలట్లు, 15 మంది క్యాబిన్ సిబ్బందితో వూహాన్ నగరంకు బయలుదేరిందని చెప్పారు. ఇక ఈ బృందంలో డాక్టర్లు, గ్రౌండ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు ఉన్నట్లు చెప్పారు.
నిశబ్దంగా ఉన్న వూహాన్ నగరం
ఇక వూహాన్ నగరంపై విమానం ఎగురుతుండటం నిజంగా ఛాలెంజింగ్గా అనిపించడమే కాదు అదో కొత్త అనుభవమని చెప్పారు. ఇప్పటి వరకు చైనాలోని ఇతర ప్రాంతాలకు విమానం నడిపామని అయితే వూహాన్కు మాత్రం నడపలేదని చెప్పారు. ఇక వూహాన్ నగరమంతా నిశబ్దంగా ఉన్నిందని చెప్పారు. 100 అడుగుల ఎత్తులో లైట్లతో ఉన్న నగరాన్ని చూసినట్లు చెప్పారు. కానీ మనుషులు లేదా వాహనాలు తిరగడం తమకు కనిపించలేదని చెప్పారు. అంతేకాదు వూహాన్ విమానాశ్రయం కూడా చాలా నిశబ్దంగా ఉందని అన్ని విమానాలు పార్కింగ్లోనే ఉండిపోయాయని చెప్పారు.
Recommended Video
అవసరమైతే మళ్లీ ఇలాంటి మిషన్లు చేపడతాం
వూహాన్లో ల్యాండ్ అయిన విమానం అక్కడే కొన్ని గంటల పాటు ఉన్నిందని చెప్పారు అమితాబ్ సింగ్. ఇక విమానంలో వచ్చిన ఇంజినీర్లు అంతా విమానం తిరిగి వెళ్లేందుకు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఆ సమయంలో భారత కాన్సులేట్లో ఉన్న భారతీయులందరినీ విమానాశ్రయంకు బస్సులో తరలించినట్లు చెప్పారు.విమానాశ్రయంలో భారతీయులకు పలు మెడికల్ టెస్టులు నిర్వహించినట్లు చెప్పారు. ఇక వీరిని ఎయిర్పోర్టులో చూడగానే వారి ముఖాల్లో ఏదో భయం కనిపించిందని చెప్పారు. ఇక ఒక్కసారిగా విమానంలోకి ఎక్కగానే వారి ముఖాల్లో ఒక రిలీఫ్ కనిపించిందని చెప్పారు అమితాబ్ సింగ్. ఎయిరిండియా సిబ్బందిపై ప్రయాణికులు ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. ఇక ఆ తర్వాత మరో విమానం వూహాన్ నగరంకు బయలుదేరి మరో 330 మంది భారతీయులను తీసుకొచ్చిందని చెప్పారు. ఇక వారంరోజుల పాటు అంతా ఐసొలేషన్ సెంటర్లో ఉన్నామని ఇక అన్ని మెడికల్ టెస్టులు పూర్తయి బయటకొచ్చి తిరిగి విధుల్లో చేరినట్లు కెప్టెన్ అమితాబ్ సింగ్ చెప్పారు. మళ్లీ వూహాన్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా తప్పకుండా వెళతామని చెప్పారు కెప్టెన్ అమితాబ్ సింగ్.