కరోనా: సీఎంల రిక్వెస్ట్కు మోదీ ఓకే.. అమిత్ షా ద్వారా రూ. 11వేల కోట్లు
దేశంలో కరోనా రక్కసి విజృంభిస్తున్నది. దాని బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకుంటున్నచర్యలు, వ్యాధి బారినపడినవాళ్లకు ట్రీట్మెంట్ కొనసాగుతున్న తీరు, లాక్ డౌన్ నేపథ్యంలో సమస్యలు.. తదితర అంశాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంలో ప్రత్యేక నిధులు కావాలని సీఎంలు కోరగా అందుకు ప్రధాని సరేనన్నారు.
ప్రధాని సూచన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం రాష్ట్రాలకు రూ.11,092 కోట్లను విడుదల చేశారు. స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్ (ఎస్డీఆర్ఎంఎఫ్) కింద ఈ నిధులను విడుదల చేస్తున్నామని, ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు, కరోనా సంబంధిత ఇతర పనుల కోసం ఈ నిధుల్ని వాడుకోవచ్చని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు రూ.15వేల కోట్లు ఖర్చుచేయబోతున్నట్లు ప్రధాని చెప్పడం తెలిసిందే. తద్వారా కేవలం కరోనా ఏర్పాట్ల కోసమే కేంద్రం మొత్తంగా రూ.26,092 కోట్లు విడుదల చేసినట్లయింది.
ఓవైపు యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తున్నా కొవిడ్-19 కేసులు సంఖ్య భారీగా పెరుగుతున్నది. శుక్రవారం రాత్రి సమయానికి దేశవ్యాప్తంగా 2976 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 78 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 75 కొత్త కేసులు రావడంతో మొత్తం సంఖ్య 229కి పెరిగింది. ఏపీలో 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.