కరోనా: దేశవ్యాప్త లాక్ డౌన్ అట్టర్ ఫ్లాప్.. ప్రధాని మోదీ ప్లాన్-బీ ఏంటి?.. 5.0 వేళ పొలిటికల్ బాంబ్
గ్రీన్ జోన్లలో దాదాపు అన్ని దుకాణాలు తెరిచారు.. కానీ జనం నిత్యావసరాలు తప్ప మిగతావి కొనడంలేదు.. కొన్ని రంగాల ఫ్యాక్టరీలు తెరుచుకోవచ్చని చెప్పినా.. వలసకూలీలు వెళ్లిపోవడంతో పని కుంటుపడింది.. ఇటు డొమెస్టిక్ విమాన సర్వీసులు పున:ప్రారంభంకాగా, స్పెషల్ రైళ్లకు తోడు జూన్ 1 నుంచి మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తామంటోన్న రైల్వే శాఖ.. సడలింపుల సంగతి ఎలా ఉన్నా.. లాక్ డౌన్ ప్రధాన ఉద్దేశమైన ''కరోనా వైరస్ కట్టడి''ని ప్రభుత్వాలు సాధించగలిగాయా? పరిస్థితి తలకిందులైతే కనీసం ప్లాన్-బీ సిద్ధం చేశారా?
సూటి ప్రశ్నలు..
ఏరోజూ ఆరు వేలకు తగ్గకుండా గడిచిన వారమంతా కొత్త కేసులు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం మరో 6,535 కేసులు జతకావడంతో దేశంలో కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 1.45లక్షలకు పెరిగింది. మరణాలు 4,167కు చేరాయి. రికవరీ రేటు 40 శాతం దాకా ఉన్నప్పటికీ, వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా ఎంతకీ కంట్రోల్ లోకి రాకపోవడంతో కేంద్రం.. దేశవ్యాప్త లాక్ డౌన్ ను మళ్లీ పొడిగించబోతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రశ్నలు సంధించారు. మంగళవారం ఆన్ లైన్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన లాక్ డౌన్, మోదీ ఆలోచనా విధానంపై సంచలన విమర్శలు చేశారు.
నాలుగు దశల్లో సాధించింది సున్నా
‘‘మార్చి 25న తొలి దశ లాక్ డౌన్ ప్రకటించిరోజు దేశప్రజలంతా ప్రధాని మోదీని నమ్మారు. లాక్ డౌన్ తో కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చన్న పిలుపును జనం పాటించారు. కానీ రోజులు గడిచేకొద్దీ కేంద్రం చేష్టలుడిగి కూర్చుందే తప్ప సమస్య పరిష్కారానికి పని చేయలేదు. లాక్ డౌన్ తో కరోనా దానంతట అదే మాయమైపోతుందని మోదీ, ఆయన కేబినెట్ గుడ్డిగా నమ్మారు. తీరా మూడో దశ పూర్తయ్యేనాటికి తప్పుదారిలో వెళుతున్నట్లు గుర్తించారు. కానీ ఆ తర్వాత జాగ్రత్తలే లేని సడలింపులు ప్రకటిస్తూ మరింత ప్రమాదకర నిర్ణయాలు తీసుకున్నారు. వలసకూలీలు, ఎంఎస్ఎంఈ, వ్యవసాయరంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. మొత్తంగా నాలుగు దశల దేశవ్యాప్త లాక్ డౌన్ దారుణంగా ఫెయిలైంది''అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా...
ప్లాన్-బీ ఉందా?
లాక్ డౌన్ అట్టర్ ప్లాప్ అయిందనడానికి దేశంలో పెరుగుతున్న కేసులే నిదర్శనమని, అరకొరగా టెస్టులు చేస్తేనే ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు వస్తోంటే.. ఫుల్ స్కేల్ లో గానీ టెస్టులు చేస్తే అసలు బండారం బయటపడుతుందని రాహుల్ అన్నారు. ఇంత జరిగిన తర్వాతైనా.. దేశభవిష్యత్తుపై ప్రధాని మోదీ దగ్గర కనీసం ప్లాన్-బీ ఉందా? ఎంతసేపు చీప్ రాజకీయాలు తప్ప నిర్మాణాత్మకంగా దేశాన్ని నడిపించే ఆలోచనా ఉందా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్న రాష్ట్రాల్లో పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు జమ చేస్తున్నామని, ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదని రాహుల్ చెప్పారు. నిర్మల సీతారామన్ ప్యాకేజీని విమర్శిస్తూ.. ‘‘ఏ తల్లీ తన బిడ్డలకు అప్పులు ఇవ్వదు.. కష్టమొస్తే కడుపులో పెట్టుకుంటుంది. దేశ ప్రజలకు ఇప్పుడు కవాల్సింది నగదు సాయం. రుణసదుపాయం కాదు..''అని ఎద్దేవా చేశారు.
జూన్ 30 వరకు లాక్ డౌన్?
దేశమంతా ఆశించినట్లు వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాకపోగా, రోజురోజుకూ కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం, జులై నాటికిగానీ మన దేశంలో వైరస వ్యాప్తి పీక్స్ కు చేరదని నిపుణులు చెడుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ గడువును మరికొంత కాలం మరికొంత కాలం పొడిగించే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తున్నది. ఈలోపే హిమాచల్ ప్రదేశ్ లోని రెండు జిల్లాల్లో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం లాక్ డౌన్ 5.0పై హింట్ ఇచ్చారు. లాక్ డౌన్ 4.0 మే 31తో ముగియనుండగా.. ఎగ్జిట్ ప్లాన్ పై ఒకటి రెండు రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వనుందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.
ఆమె కోరితే అదెంతపని?
లాక్ డౌన్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన కోట్లాదిమంది వలసకూలీలు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి తమ సొంత ఊళ్లకు నడుచుకుంటూ వెళ్లిపోయిన.. ఇంకా నడుస్తూనేఉన్న దృశ్యాలు అందరినీ కంటతడిపెట్టించాయి. వలసకూలీలను ఆదుకోవడంలో కేంద్ర సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపిన రాహుల్ గాంధీ.. కొద్ది రోజుల కిందట ఢిల్లీ రోడ్లపై వలస కూలీలను కలిసి, వాళ్ల కోసం వాహనాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ప్రియాంక గాంధీ కూడా వెయ్యి బస్సులు ఏర్పాటు చేయడం తెలిసిందే. దీన్నొక నాటకంగా కొట్టిపారేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ‘‘కూర్చొని సొల్లు ముచ్చట్లు పెట్టే బదులు.. ఆ వలస కూలీల బ్యాగులు మోస్తూ రాహుల్ కూడా నడిచి వెళ్లొచ్చుకదా..'' అని ఎద్దేవా చేశారు. మంగళవారం నాటి ప్రెస్ మీట్ లో నిర్మల కామెంట్లపై స్పందించిన కాంగ్రెస్ నేత.. ‘‘ఆమె కోరితే అదెంతపని? నాకు పర్మిషన్ ఇవ్వాలేగానీ వలస కూలీలతో కలిసి యూపీదాకా నడవడానికి నేను రెడీగా ఉన్నాను''అని అన్నారు.