march 22 to 31st: మోడీ 14 గంటలు, కేసీఆర్ 24 గంటలు, గెహ్లాట్ మాత్రం 10 రోజులు లాక్డౌన్..
కరోనా వైరస్కు మందు లేదు.. నివారణ ఒక్కటే మార్గం. అందుకే ప్రధాని మోడీ ఆదివారం జనతా కర్ప్యూనకు పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి దేశవ్యాప్తంగా రహదారులపై జనం లేక రోడ్లు బోసిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అయితే వైరస్ తీవ్రత దృష్ట్యా.. రాజస్థాన్లో ఈ నెల 31వరకు లాక్ డౌన్ కొనసాగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యం, భద్రత కోసమే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ఎమర్జెన్సీ మాత్రం..
అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని గెహ్లాట్ స్పష్టంచేశారు. పాలు, కూరగాయలు విక్రయం, మెడికల్ షాప్, ఆస్పత్రులు, పారిశుద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. 22వ తేదీ నుంచి 31 వరకు పదిరోజుల పాటు జనం ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కరోనా వైరస్పై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయం మేరకు డిసిషన్ తీసుకున్నట్టు సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.
బస్సుల బంద్...
ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్, ఫ్యాక్టరీలు, ప్రజా రవాణా నిలిచిపోతుందని గెహ్లాట్ తేల్చిచెప్పారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ స్వరూప్ నేతృత్వంలో కోర్ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆపత్కాల సమయంలో ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడొద్దని సూచించారు. రాష్ట్రంలో ఉన్న కోటి మంది రేషన్ దారులకు మే నెల వరకు ఉచితంగా గోధుమలు అందజేస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టంచేశారు. ఇక పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి ఆహార పొట్లాలు అందజేస్తామని వివరించారు. రోజువారీ కూలీలు, వీధి వర్తకులకు ఉచితంగా ఆహార ప్యాకెట్లను అందజేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సమన్వయంతో మున్సిపల్ అధికారులు ఆహార పొట్లాలు అందజేస్తారని పేర్కొన్నారు.
మూసివేసిన సమయంలో వేతనం
ప్రభుత్వం అందజేసే పెన్షన్లను ఎప్పటిలాగే ఏప్రిల్ మొదటివారంలో అందజేస్తామని.. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు కంపెనీ మూసివేసిన సమయంలోనూ వేతనం అందజేస్తామని గెహ్లాట్ పేర్కొన్నారు. రాజస్థాన్లో 25 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 40 మందికి పరీక్షలు చేశామని.. రిపోర్టు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.