Coronavirus: కార్పోరేటర్ కు కరోనా, ఢాం డుస్ అంటూ భారీ ర్యాలీ ఊరేగింపు: తోలు తీసి అక్కడికే!
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి సోకిన తరువాత ఆసుపత్రికి వెళ్లడానికి నానా రాద్దాంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ను అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్ వ్యాధి సోకడంతో ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు ఆయన్ను నేరుగా ఇంటికి వెళ్లి కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కార్పోరేటర్ భారీ హంగామాతో కార్లు, బైక్ లతో ఊరేగింపుగా ఆయన ఇంటికి బయలుదేరాడు. కార్పోరేటర్ ఊరేగింపు సందర్బంగా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని, భారీ ట్రాఫిక్ జామ్ కావడానికి కారణం అయ్యారని, కరోనా వైరస్ వ్యాపించడానికి ప్రత్యక్షంగా కారణం అయ్యారని ఆరోపిస్తూ ఆయనగారిని పోలీసులు అరెస్టు చేసి కరోనా క్వారంటైన్ కు తరలించడంతో కార్పోరేటర్ తిక్కకుదిరింది.
Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త
కార్పోరేటర్ తిక్కచేష్టలు
దేశ ఐటీ బీటీ రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని బీబీఎంపీ పాదరాయణనపుర వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా మొదటి నుంచి ఎక్కువ తిక్కచేష్టలు చేస్తాడని ఆరోపణలు ఉన్నాయి. కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా వ్యాధి సోకిందని తెలుసుకున్న వైద్యులు, పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించడానికి ఆయన ఇంటి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో తన తల్లి ఇంట్లో లేరని, ఆమె వచ్చి ఖురాన్ చదివిన తరువాత తాను ఇంటి నుంచి బయటకు వస్తానని, చచ్చినా నేను ఆసుపత్రిలో చేరనని ఇమ్రాన్ పాషా మొండికేశాడు.
విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం
దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీ తబ్లీగిలు అక్కడి నుంచి తప్పించుకుని చాకచక్యంగా బెంగళూరు చేరుకున్నారు. విదేశాలకు చెందిన 19 మంది తబ్లీగి జమాత్ సభ్యులకు కాంగ్రెస్ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా పాదరాయనపురలోని మసీదులో అక్రమంగా ఆశ్రయం ఇచ్చారని ఇప్పటికే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఆసుపత్రిలో హంగామా
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ జోక్యం చేసుకోవడంతో అతి బలవంతం మీద కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసినా కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా విక్టోరియా ఆసుపత్రిలోని ఆయన వార్డు నుంచి బయటకు వచ్చి రోగులు ఉన్న వార్డుల్లో నానా హంగామా చేశాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ తో పాటు అనేక మంది బీజేపీ మంత్రులు, నాయకులు ఇటీవల మండిపడ్డారు.
ఢాం డుస్ అంటూ కార్లు, బైక్ ల్లో రచ్చరచ్చ
కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాకు మెరుగైన చికిత్స అందించిన వైద్యులు ఆయనకు కరోనా వ్యాధి నయం చేశారు. కరోనా వైరస్ వ్యాధి నయం కావడంతో మీరు ఇంటికి వెళ్లి కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించిన వైద్యులు ఆయన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరిన కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా ఆయన అనుచరులతో కలిసి భారీ ఊరేగింపుగా టపాకాయలు కాల్చుతూ మైసూరు రోడ్డులో బైక్ లు, కార్లలో ఊరేగింపుగా వెళ్లారు. సుమారు 150 మంది కార్పోరేటర్ అనుచరులు నానా హంగామా చెయ్యడంతో మైసూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Recommended Video
దెబ్బకు తిక్క కుదిరింది
కరోనా వైరస్ వ్యాధి సోకి ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత నేరుగా ఇంటికి వెళ్లకుండా అనుచరులతో కలిసి హంగామా చేస్తూ ఊరేగింపుగా వెళ్లారని, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని, అంటురోగాలు వ్యాపించడానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ మీద కేసు నమోదైయ్యింది. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మళ్లీ కరోనా క్వారంటైన్ కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా అరెస్టు కావడంతో నానా హంగామా చేసిన ఆయన అనుచరుల తిక్క కుదిరిందని పోలీసులు అంటున్నారు.