కరోనా: ఎమ్మెల్యే సారూ.. ఎందీ.. ఇదీ... బర్త్ డే పేరుతో సరుకులు పంపిణీ, గుమికూడిన 100 మంది...
మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం పెడచెవిన పెట్టాడు. కరోనా వైరస్ అయితే ఏంటీ.. అనేలా ప్రవర్తించాడు. తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు అందజేశాడు. అయితే ఇందుకోసం వందలాది మంది గుమికూడటంతో ఆందోళన నెలకొంది.
వార్దా జిల్లా ఆర్వి నియోజకవర్గంలో ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే దాదారావు కెచే పుట్టిన రోజు ఆదివారం.. అయితే ఏటా పుట్టినరోజు సందర్భంగా పేదలకు గోధుమలు, బియ్యం ఇతర సరుకులు అందజేస్తారట. ఈసారి కూడా కొందరికీ అందజేస్తే.. ఇబ్బంది లేదు. కానీ వందమందికి పైగా గుమిగుడి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. పేదలను తరిమివేసే వరకు అంతా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే ఇంటి వద్ద జనం గుమికూడి ఉన్న వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. వెంటనే ఆది వైరలైంది. దీనిపై ఎమ్మెల్యేను 'ఇండియా టుడే' ప్రతినిధి వివరణ కోరగా.. తనదైన శైలిలో సమాధానం చెప్పి తప్పించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా ఏటా 21 మందికి సరుకులు అందజేస్తానని వివరించారు. ఈ సారి కూడా 21 కుటుంబాలకు వస్తువులు అందజేయాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
సరుకులు అందజేస్తోన్న విషయం పేదలకు తెలిపి, వారిని రప్పించింది విపక్ష నేతలేనని ఆరోపించారు. అందుకోసమే వారు గుమికూడి ఉండొచ్చని తెలిపారు. పేదలకు సరుకులు అందచేసి.. గుడికి వెళ్లొచ్చేవాడినని చెప్పుకున్నారు. కానీ ఆదివారం మాత్రం కుట్ర జరిగిందని తప్పించుకొనే ప్రయత్నం చేశారు.