కోవిడ్-19: ఆర్మీ అధికారికి సోకిన కరోనావైరస్.. క్వారన్టైన్లోకి బీఎస్ఎఫ్ క్యాంపు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఉన్న తెకన్పూర్ బీఎస్ఎఫ్ అకాడెమీలో పనిచేస్తున్న ఆర్మీ ఆఫీసర్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో ఆ క్యాంపులోని 50 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఇద్దరు ఈ మాయదారి మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
ఇక అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ), ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), బీఎస్ఎఫ్ అకాడెమీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే పాజిటివ్ నిర్థారణ అయిన అధికారి కూడా హాజరయ్యారు. క్వారంటైన్ గురించి ఆ సెంటర్ల ఏర్పాటుపై బీఎస్ఎఫ్ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఈ సమావేశం నిర్వహించారు. అయితే తన భార్య నుంచి అధికారికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అధికారి భార్య ఈ మధ్యే యూకే నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె నుంచి ఈ అధికారికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కమాండ్ ర్యాంక్ ఆఫీసర్లో రెండో ర్యాంకులో కొనసాగుతున్న ఈ 57 ఏళ్ల ఆర్మీ అధికారి ప్రస్తుతం స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ అధికారి కనీసం 24 మందితో కాంటాక్ట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణలోకి వెళ్లిపోవాలని ఆదేశించడం జరిగింది. ఇదిలా ఉంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్కు చెందిన మరో అధికారికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలింది.
ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య తొమ్మది వందలకు పైగానే ఉండగా మృతుల సంఖ్య 21కి చేరింది. శ్రీనగర్లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు తాజాగా ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.