కరోనా: పేదలకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేపై కేసు, ఎందుకంటే..
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ ఎమ్మెల్యే దాదారావు కెచే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా వార్దాలోని తన నివాసం వద్ద పేదలకు సరుకులు పంపిణీ చేశారు. ఆ సమయంలో అందరూ గుమిగుడి ఉండటం ఆందోళన కలిగించింది. అక్కడికొచ్చిన పోలీసులు, అధికారులు వారిని చెదరగొట్టగా.. తీసిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరలవడంతో.. సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు ఎమ్మెల్యే దాదారావుపై కేసు ఫైల్ చేశారు.
అధికారుల అనుమతి తీసుకోకుండానే పేదలకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పోలీసులు చెబుతున్నారు. వంద మంది వరకు గుమిగూడితే సామాజిక దూరం కూడా పాటించలేదన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే కేసు నమోదు చేశామని పోలీసు అధికారి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.
Recommended Video
అయితే తాను 21 మంది పేదలనే పిలిచానని.. మిగతా వారిని విపక్ష నేతలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. తనపై కావాలనే కొందరు కుట్ర చేశారని మండిపడ్డారు. పేదలకు రేషన్ ఇచ్చి.. గుడికెళ్లి దండం పెట్టుకునేవాడినని... కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువమందికి రేషన్ అందజేయడం వల్ల ఆలయానికి కూడా వెళ్లలేదన్నారు. కానీ తనపై కొందరు అసత్యాలు ప్రచారం చేయడంతో కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.