కరోనా విజృంభణ: దేశంలో 9 లక్షల దాటిన కరోనా కేసులు, రికవరీ రేటూ పెరిగింది
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింత విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 28,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,06,752కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో 553 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య 23,727కు చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 5,71,460 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,11,565 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63.02 శాతంగా ఉంది. మృతుల రేటు 2.64శాతంగా ఉంది.
కాగా, గత మూడు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో జులై 1 నుంచి 3,21,259 కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 6327 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, తమిళనాడులో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షలను కూడా భారీ నిర్వహిస్తోంది. జులై 13 నాటికి దేశంలో కోటి 20 లక్షల నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1200 కేంద్రాలకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 2 లక్షలకుపైగా కరోనా పరీక్షలు జరుగుతుండటం గమనార్హం.