ముందుంది అసలు సీన్.. జూన్,జులైలో పీక్స్.. కరోనాపై నిపుణుల అభిప్రాయం..
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1,39,049కి చేరుకున్నాయి. కేసుల సంఖ్య వందల్లో ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం.. లక్షల్లోకి చేరినప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే భారత్ లాంటి దేశాల్లో సుదీర్ఘ కాలం లాక్ డౌన్ సాధ్యం కాదనేది నిపుణుల మాట. అంతేకాదు, ఇరాన్,చైనా వంటి దేశాలు కూడా క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేస్తూ వచ్చాయని చెబుతున్నారు. అయితే భారత్లో మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రముఖ ఎపిడిమియాలజిస్ట్ తన్మయ్ మహాపాత్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా: ఒకే రోజు 4 మృతి, కొత్తగా 41 కేసులు.. తెలంగాణలో తగ్గని వైరస్ వ్యాప్తి..
నిపుణులు ఏమంటున్నారు...
బీహార్లో కేర్ ఇండియా టీమ్కు నేత్రుత్వం వహిస్తున్న ఎపిడిమియాలజిస్ట్ తన్మయ్ మహాపాత్ర మాట్లాడుతూ... 'భారత్లో కేసుల సంఖ్య పెరుగుదలకు రకరకాల కారణాలున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో టెస్టులు జరుగుతుండటం,ప్రభుత్వం ఎక్కువ యాక్టివిటీస్కి అనుమతించడం వంటివి అందుకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే భారత్ లాంటి దేశాల్లో ఎప్పటికీ లాక్ డౌన్ కొనసాగించడమన్నది జరగని పని. కొన్నిచోట్ల కొంత ఎకనమిక్ యాక్టివిటీస్కు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అంతమాత్రాన ప్రజలు ఇష్టమొచ్చినట్టుగా తిరగవద్దు. అలాగే లాక్ డౌన్ నిబంధనలను క్రమ క్రమంగా ఎత్తివేయాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు.
జులైలో పీక్స్కి...
భారత్లో ఇప్పటివరకూ నమోదైన కేసుల కంటే మరిన్ని ఎక్కువ కేసులు జూన్ నెలలో నమోదయ్యే అవకాశం ఉందన్నారు మహాపాత్ర. ఇక జులై అది పీక్స్కి వెళ్లే అవకాశం ఉందన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో పాటు ఎక్కువ ర్యాండమ్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా కరోనా లక్షణాలు లేనివారిలోనూ పాజిటివ్ కేసులు గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. లాక్ డౌన్ సడలింపును గత వారంలో పెరిగిన కేసులతో ప్రత్యక్షంగా ముడిపెట్టలేమని చెప్పారు. లాక్ డౌన్ ప్రభావం రాబోయే రోజుల్లో మాత్రమే స్పష్టమవుతుందన్నారు. దేశంలో ఇప్పటివరకూ పెరిగిన కేసులు సాధారణ వృద్ధి సరళికి అనుగుణంగానే ఉందన్నారు.
లాక్ డౌన్ సడలింపులతో కేసుల పెరుగుదల..
శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులో దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. శుక్రవారం 6వేల కేసులు,శనివారం 6654 కేసులు,ఆదివారం ఉదయం వరకు 6767 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా మే 24వ తేదీ వరకు దేశంలో కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. గత రెండు నెలల పాటు కఠినమైన లాక్ డౌన్ పాటించిన భారత్.. ఇటీవలే లాక్ డౌన్ 4.0ని ప్రకటించి చాలావరకు సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క భారత్లోనే కాదు..
లాక్ డౌన్ సడలింపుల తర్వాత కేసులు పెరగడం భారత్లోనే కాదు ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. ఇరాన్లో మార్చి నెలలో కరోనా కేసులు విపరీతంగా నమోదవగా.. ఏప్రిల్లో తగ్గుముఖం పట్టి రికవరీ కేసులు పెరిగాయి. దీంతో కొన్ని వేల యాక్టివ్ కేసులు మాత్రమే మిగిలాయి. కానీ ఏప్రిల్లో ఇరాన్ క్రమంగా ఎకనమిక్ యాక్టివిటీస్ను ప్రారంభించడంతో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఏప్రిల్ చివరి నాటికి ప్రతీ రోజూ సగటున 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే నాటికి దాని ప్రభావం రెట్టింపవడంతో ఇరాన్లో సెకండ్ వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది.