కరోనా-లాక్డౌన్: ఖచ్చితంగా అమలు చేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇతర రాష్ట్రాల్లోని వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేయాలి..
పనులు లేక ఇతర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కూలీలను 14 రోజులపాటు క్వారంటైన్ చేయాలని కేంద్రం సూచించింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కూలీలు రాష్ట్రాలు, నగరాలు దాటకుండా సరిహద్దులను మూసివేయాలని స్పష్టం చేశారు.
ఎక్కడికక్కడే క్వారంటైన్లు ఏర్పాటు..
అవకాశం ఉన్నంత వరకు జాతీయ రహదారుల పక్కనే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాజీవ్ సూచించారు. అయితే, ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు చేరుకున్న వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్లకు తరలించాలన్నారు. ఈ చర్యతో కరోనా వ్యాప్తిచెందకుండా ఉంటుందని తెలిపారు. విపత్తు నివారణ చట్టం కింద జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని ఈ నిబంధనలను అమలయ్యే చూడాలని ఆదేశించారు.
వలస కూలీల ఇక్కట్లు..
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో పలు రాష్ట్రాల్లోని వలసకూలీలు తమ సొంత రాష్ట్రాలకు పయనమైన విషయం తెలిసిందే. అయితే మార్గమధ్యలో పలు చెక్ పోస్టుల వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఢిల్లీ నుంచి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవడంతో తమ రాష్ట్రాల వలస కూలీల కోసం యూపీ, బీహార్ వెయ్యికిపైగా బస్సులను ఏర్పాటు చేశాయి.
యూపీలో లక్ష మంది కూలీలు క్వారంటైన్..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి మూడు రోజుల్లో 1.5లక్షల మంది రాగా, వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించి, భోజన వసతి, అవసరమైన వైద్యం అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. బీహార్ సీఎం నితీష్ కూడా తమ రాష్ట్రంలోకి వచ్చిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాల్లోకి తరలించాలని ఆదేశించారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షలు చేసి వారిని సొంత గ్రామాలకు తరలించారు.