కరోనావైరస్: ఒక్క కోవిడ్ కేసు కనిపించడంతో షిన్జియాంగ్లోని ఓ నగరాన్నంతా టెస్ట్ చేస్తున్న చైనా - NewsReel
షిన్జాంగ్ ప్రాంతంలో స్థానికంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండడంతో చైనా మరోసారి నగరవ్యాప్త కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించింది.
కాష్గార్ నగరంలో దాదాపు 47 లక్షలమందికి కరోనావైరస్ పరీక్షలు జరిపారు. వారిలో 138 మందికి వ్యాధి ఉన్నప్పటికీ, లక్షణాలు బయటపడలేదని (అసింప్టమాటిక్) తేలింది.
కోవిడ్ 19ను కట్టడి చెయ్యడంలో చైనా చాలావరకూ విజయవంతమైంది. కానీ, అక్కడక్కడా స్థానికంగా తక్కువ స్థాయిలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది.
షిన్జాంగ్ ప్రావిన్స్లో అధిక సంఖ్యలో వీగర్ ముస్లింలు నివసిస్తున్నారు. వీరందరినీ చైనా ప్రభుత్వం హింసిస్తోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడ చైనా నిర్బంధ శిబిరాలను నిర్వహిస్తోందని వీరు ఆరోపిస్తున్నారు.
అయితే, మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకే ఈ చర్యలు తీసుకుంటోందని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ స్థానిక ముస్లిం మైనారిటీల భాష, సంస్కృతిని అణచివేయడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.
ప్రస్తుతం, కోవిడ్ 19 కారణంగా కాష్గార్లో స్కూళ్లనీ మూతపడ్డాయి. కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వస్తే తప్ప స్థానికులు నగరం విడిచి వెళ్లకూడదని నిబంధనలు విధించారు.
కాష్గార్ నగర శివార్లలో ఉన్న షుఫు కౌంటీ వస్త్ర కర్మాగారంలో పని చేస్తున్న మహిళకు మొట్టమొదట కరోనావైరస్ సోకినట్లుగా గుర్తించారు.
అయితే, ఆమెకు వ్యాధి లక్షణాలు బహిర్గతమవ్వలేదు. రొటీన్ పరీక్షల్లో భాగంగా ఆమెకు కోవిడ్ 19 ఉన్నట్లు వెల్లడైందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. చైనా ప్రధాన భూభాగంలో గత 10 రోజుల్లో నమోదైన మొట్టమొదటి కేసు ఇదేనని స్థానిక మీడియా తెలిపింది.
గత శనివారం విస్తృతంగా జరిపిన పరీక్షల్లో మరో 137మందికి వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయటపడలేదని తేలింది.
వ్యాధి లక్షణాలు బయటపడని కేసులను చైనా అధికారిక లెక్కల్లో చేరట్లేదు. ప్రస్తుతం చైనాలో దాదాపు 91 వేలకోవిడ్ కేసులు నమోదు కాగా, 4,634 మరణాలు సంభవించాయి.
గత ఆదివారం మధ్యహ్నానికి కాష్గార్లో 28 లక్షలమందికి పరీక్షలు జరిపారని, రాబోయే రెండు రోజుల్లో మిగిలినవారికి కూడా పరీక్షలు జరుపుతారని నగర అధికారులు తెలిపారు.
చైనాలో చాలా వరకూ సాధారణ జీవితం తిరిగి ప్రారంభమైనప్పటికీ అక్కడక్కడా కేసులు బయటపడుతుండడంతో అధికారులు తక్షణ సామూహిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ మొదట్లో చిండావో నగరంలో మొత్తం 90 లక్షల జనాభాకు కోవిడ్ 19 పరీక్షలు జరిపారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- 'జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)