కరోనా వైరస్ దెబ్బ, కంపెనీ ఉద్యోగులకు 28 రోజులు సెలవు, పూర్తి జీతం ఇవ్వాలి, కలెక్టర్లదే బాధ్యత !
బెంగళూరు: ప్రపంచ దేశాలకు హడలు పుట్టిస్తున్న కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్- 19) వ్యాపించకుండా కర్ణాటక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నది. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించిన వెంటనే ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీలు, సంస్థలు 28 రోజుల పూర్తి సెలవులు మంజూరు చెయ్యాలని, ఆ సెలవు రోజులకు పూర్తి వేతనం (జీతం) చెల్లించాలని కర్ణాటక కార్మిక శాఖ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ముందుగా కరోనా వైరస్ వ్యాపించకుండా ఆ కంపెనీలు, సంస్థలు ముందు జాగ్రత్తగా అనేక చర్యలు తీసుకోవాలని కర్ణాటక కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగికి కరోనా వైరస్ వ్యాధి నయం అయ్యే వరకు సంబంధిత కలెక్టర్లు బాధ్యత వహించాలని కర్ణాలక కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ దెబ్బతో 54 వేల మంది ఖైదీలు విడుదల, మా వల్లకాదే, ప్రభుత్వాలకే షాక్, కంట్రోల్ కావాలి !
బెంగళూరులో ల్యాబ్ సిద్దం
కరోనా వైరస్ వ్యాధి ఎవరికైనా సోకిందా అంటూ అనుమానాలు వ్యక్తం అయిన వెంటనే అలాంటి వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి బెంగళూరు మెడికల్ కాలేజ్ లో ప్రత్యేక ల్యాబ్ సిద్దంగా ఉంది. ఎవరికైనా కరోనా వైరస్ వ్యాధి సోకింది అనే అనుమానాలు ఉంటే వెంటనే ఎలాంటి భయం లేకుండా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కార్మిక శాఖ అధికారులు అనేక కంపెనీలు, సంస్థల ఉద్యోగులకు సూచించింది.
ఆసుపత్రిలో 28 రోజులు !
కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఇఎస్ఐ అనుబంధ సంస్థల్లోని కార్మికులు, ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రధించి వారి సూచనల మేరకు ఏ ఆసుపత్రిలో చేరాలని చెప్పారో అదే ఆసుపత్రిలో చేరాలని కార్మిక శాఖ అధికారులు సూచించారు. ఒకవేళ కరోనా వైరస్ వ్యాధి సోకింది అని నిర్ధారణ అయితే కచ్చితంగా 28 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని, ఆ 28 రోజులకు ఆ కంపెనీలు, సంస్థలు జీతాలు చెల్లిస్తాయని కార్మిక శాఖ అధికారులు స్పష్టం చేశారు.
పత్రాలు ఇవ్వాలి
కరోనా వైరస్ సోకిందని అనుమానం వచ్చిన వెంటనే కార్మికులకు, ఉద్యోగులకు ఇఎస్ఐ ఆసుపత్రి వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించి వ్యాధికి సంబంధించిన దృవీకరణ పత్రాలు ఇవ్వాలని, ఆ పత్రాలతో వారు ఏ ఆసుపత్రిలో చేరాలని సూచించారో అక్కడికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలని కార్మిక శాఖ అధికారులు తెలిపారు.
ఆ ఉద్యోగులు ఏం చెయ్యాలంటే !
ఇఎస్ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి అవకాశం లేని కొన్ని కంపెనీల ఉద్యోగులు కర్ణాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం ప్రకారం కరోనా వైరస్ సోకిన ఉద్యోగికి లేదా కార్మికుడికి కచ్చితంగా 28 రోజులు సెలవులు ఇవ్వాలని, ఆ సెలవు రోజులకు కచ్చితంగా జీతం చెల్లించాలని కార్మిక శాఖ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా కలెక్టర్లదే బాధ్యత
కరోనా వైరస్ వ్యాధి సోకిన ఉద్యోగికి లేదా కార్మికుడికి చికిత్స అందించే బాధ్యతలను ఆ జిల్లాధికారి (కలెక్టర్) చూసుకోవాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రతినిత్యం ఆసుపత్రి వర్గాలతో సంప్రధింపులు జరపాలని జిల్లా కలెక్టర్లకు కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత వైద్యులను సంప్రధించాలని కర్ణాటక కార్మిక శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మనవి చేశారు.