కరోనా: సీఆర్పీఎఫ్ హెడ్ ఆఫీస్ మూసివేత.. ఢిల్లీ ఎయిమ్స్లో వైరస్ వ్యాప్తి..
కరోనా దెబ్బకు దేశాన్ని నడిపించే వ్యవస్థలు దెబ్బతింటూ వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కారణంగా మూడ్రోజుల కిందట.. అభివృద్ధి విధానాలు రూపొందించే నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం మూతపడగా, ఇప్పుడు సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ ను సీజ్ చేయాల్సి వచ్చింది.
Recommended Video
సీఆర్పీఎఫ్ హెడ్ ఆఫీసులో స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఛాంబర్ లో పనిచేస్తోన్న ఓ ఉద్యోగికి పాజిటివ్ రావడంతో మొత్తం కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్లు ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆఫీసులో క్రిమిసంహారక మందులు పిచికారిచేయబోతున్నట్లు చెప్పిన అధికారులు.. మూసివేత ఎన్ని రోజులు కొనసాగుతుందో స్పష్టం చేయలేదు. మరోవైపు..
కరోనా చికిత్సలో మొదటి నుంచీ ముందున్న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో వైరస్ వ్యాప్తి చెందింది. అక్కడ పనిచేస్తోన్న హెల్త్ కేర్ సిబ్బందిలో 22 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అందరిలోనూ భయాందోళన వ్యక్తమైంది. మిగతా వైద్య సిబ్బంది సేఫ్ గా ఉన్నారని, అయితే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా వార్డుల వద్ద కాపలా కాస్తోన్న 100 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బందిని క్వారంటైన్ కు తరలించామని ఉన్నతాధికారులు చెప్పారు.
దేశంలో రెండో దశ లాక్ డౌన్ పూర్తయి, మూడో దశ మొదలుకానున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కొవిడ్-19 మరణాల సంఖ్య 1301కి పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 39,980గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో మొత్తం 4,122 కేసులు నమోదుకాగా, అందులో 1256 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2802 యాక్టివ్ కేసులకు చికిత్స కొనసాగుతోంది.