బ్యాడ్ న్యూస్: ఇండియాకు వ్యాపించిన కరోనా వైరస్.. ముంబైలో ఇద్దరికి గుర్తింపు
ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న మహమ్మారి 'కరోనా వైరస్' రోజురోజుకూ విస్తరిస్తోంది... ఇప్పటికే చైనాలో 25 మందిని బలి తీసుకుంది.. అక్కడే మరో 800 మందిని అతలాకుతలం చేస్తోంది.. జపాన్, థాయిలాండ్, అమెరాకాలకూ వ్యాపించింది.. గురువారం సౌదీ అరేబియాలో పనిచేస్తోన్న ఓ కేరళ నర్సుకూ వ్యాపించింది.. శుక్రవారం నాటికి ఇండియాలోనూ ఆ వ్యాధి లక్షణాలున్న ఇద్దరిని గుర్తించడంతో ఆందోళన రెట్టింపైంది.
ఆర్థిక రాజధానిపై పంజా
గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోన్న నిజంగా చేదువార్తే. మహమ్మారి ‘నావల్ కరోనా వైరస్‘ ఇండియాలోకి ప్రవేశించింది. తొలి పంజా మన ఆర్థిక రాజధాని ముంబైపై విసిరింది. చైనా నుంచి ముంబై వచ్చిన ఇద్దరు వ్యక్తులకు వైరస్ సోకినట్లు గుర్తించామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. ఆ ఇద్దరరి ప్రస్తుతం.. దక్షిణ ముంబై, చించ్పోకలిలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బీఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజా కేస్కర్ చెప్పారు.
కరోనా వైరస్ అంటే?
చైనాలో తాచు పాముల వల్ల వ్యాపించినట్లుగా భావిస్తోన్న ఈ ప్రాణాంత వైరస్ సోకితే.. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు అన్ని దేశాల ఎయిర్ పోర్టుల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్ని థర్మల్ స్కానర్లతో పరీక్షలు చేసిన తర్వాతే వదులుతున్నారు. అలా ముంబైలో రెండు కేసుల్ని గుర్తించారు.
ముంబైలో హైఅలర్ట్..
గడిచిన రెండు వారాలుగా ఆసియా దేశాలను కలవరపెడుతోన్న కరోలినా వైరస్ తొలిసారి ఇండియాలోకి ప్రవేశించడం, అది కూడా ఆర్థిక రాజధాని ముంబైకి సోకడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నది. ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ పరిధిలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు డాక్టర్ పద్మజా తెలిపారు. కరోనా ధాటికి చైనాలో జనజీవనం దాదాపు స్థంభించింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమ్మికూడొద్దని అధికారులు ఆదేశించారు.
కేరళ నర్సులకు చికిత్స కొనసాగింపు..
సౌదీ అరేబియాలోని అల్ హయత్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న ఓ కేరళ నర్సుకు కరోనా వైరస్ సోకడంతో ఆమెను అజీర్ నేషనల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 30 మంది కేరళ నర్సులు కూడా ఇన్ఫెక్షన్ కు గురై ఉంటారనే అనుమానంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. దీనిపై కేరళ సీఎం పినరయి విజయ్ ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.