lockdown: ముంబై తర్వాత ఢిల్లీ, ఇక్కడే ఉండండి, కూలీలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపు
లాక్డౌన్ పొడిగించడంతో మహారాష్ట్రలో వలసకూలీలు బాంద్రా రైల్వేస్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా.. ఢిల్లీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. దేశ రాజధానిలో ఉన్న కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అయితే ఇప్పటికే కొందరు కూలీలు గతనెలలో ఢిల్లీ నుంచి వెళ్లిపోవడంతో.. ఇప్పుడు కూడా వెళతారమోననే ఆందోళన నెలకొంది.
లాక్డౌన్ మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో వలసకూలీలు రాష్ట్రంలోనే ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అప్పటివరకు అందరూ క్రమశిక్షణతో ఉండాలని పేర్కొన్నారు. గత 21 రోజుల ఉన్న మాదిరిగానే.. మే 3 వరకు కూడా ఉండాలని తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్లో వీడియో రిలీజ్ చేశారు. అదే సమయంలో పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోరారు. మరికొందరు బస్సులు ఉన్నాయని, ఇంటికి తీసుకెళతామని మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
లాక్డౌన్ మే 3వ తేదీ వరకు ప్రధాని మోడీ పొడిగించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే సామాజిక దూరం పాటించాలని కోరారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.