coronavirus: ఢిల్లీ రోడ్డుపై కారులో నకిలీ ఐఏఎస్ షికార్లు, హోంశాఖలో పనిచేస్తున్నానని కలరింగ్..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఆందోళన నెలకొంది. వైరస్ నివారణ కోసం ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే ఓ యువకుడు మాత్రం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు. తన కారు తీసుకొని దర్జాగు వెళుతున్నాడు. అనుమానం వచ్చి పోలీసులు ఆపడంతో.. తాను ఐఏఎస్ అధికారినని కలరింగ్ ఇచ్చాడు. కానీ పోలీసులకు మాత్రం అతను చెప్పే మాటలపై అనుమానం వచ్చింది.
వాయవ్య ఢిల్లీలో 29 ఏళ్ల యువకుడు కారులో వస్తున్నాడు. వాస్తవానికి లాక్ డౌన్ ఉండటంతో ఆ వైపు వచ్చేందుకు అనుమతి లేదు. కానీ రావడంతో పోలీసులు సస్పెక్ట్ చేశారు. వెంటనే అతని కారును నిలిపివేశారు. తాను సీనియర్ ఐఏఎస్ అధికారినని చెప్పాడు. ప్రస్తుతం హోంశాఖలో పనిచేస్తున్నాడు. అతని కారుపై ఇండియన్ గవర్నమెంట్, ఢిల్లీ పోలీస్ అనే స్టిక్కర్లు ఉన్నాయి. అతని డైరీలో ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన లిస్ట్ కూడా ఉంది. కానీ అతనిపై ఎక్కడో అనుమానం వచ్చిన పోలీసులు ప్రశ్నించారు.
ఐఏఎస్ అధికారి అయితే ఐడీ కార్డు చూపించాలని పోలీసులు అడిగారు. దానికి అతను ఐడీ కార్డు కాకుండా.. కేంద్ర హోంశాఖకు సంబంధించిన ఫైల్ చూపించాడు. అతనిపై పోలీసుల ప్రశ్నల వర్షం కురిపించారు. నీళ్లు నమలడంతో అతను ఫేక్ ఐఏఎస్ అని అర్థమైంది. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.