Coronavirus: మటన్ బిర్యానీ, చిల్లీ చికెన్ కావాలి, క్వారంటైన్ లో హంగామా, బీర్లు, 90 ML వద్దా ? !
బెంగళూరు/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధిని ఎలా అరికట్టాలి ? అంటూ ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్న ప్రభుత్వాలు వారికి మూడుపూటల ఆహారం అందిస్తున్నాయి. అయితే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, కొడిగుడ్డుతో సరిపెడుతున్నారు, ఈ రోజు మర్యాదగా మటన్ బిర్యాని, చిల్లీ చికెన్ తినడానికి అవకాశం ఇవ్వండి అంటూ క్వారంటైన్ కేంద్రాల్లో కరోనా రోగులు రెచ్చిపోయారు. నాయనా మీకు చాన్స్ ఇస్తే ఇక్కడే మాకు చిల్డ్ బీర్లు, 90ML కూడా కావాలని అడుగుతారని, ఆ పప్పులు ఇక్కడ ఉడకవని పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో కోవిడ్ కేర్ సెంటర్ (CCC)లో పెద్దరాద్దాంతం జరిగింది.
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !
బెంగళూరులో కరోనా హల్ చల్
ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బెంగళూరు నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు కళ్లెం వెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వంతో పాటు బీబీఎంపీ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని ఉప్పరపేట ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి.
అసలే ఉప్పరపేట ఏరియా
బెంగళూరు నగరంలోని మెజిస్టిక్ కు కూతవేటు దూరంలో ఉప్పరపేట ఏరియా ఉంది. మెజిస్టిక్ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వారికి చికిత్స అందించడానికి ఉప్పరపేటలోని కోవిడ్ కేర్ సెంటర్ (CCC) ఏర్పాటు చేశారు. ఉప్పరపేటలోని కోవిడ్ కేర్ సెంటర్ లో అనేక మంది కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లు, కరోనా వ్యాధి సోకిన వాళ్లు చికిత్స పొందుతున్నారు.
ఆదివారం తెచ్చిన తంటా !
ఉప్పరపేట్ కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న కొందరు రోగుల కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి వారి ఇళ్ల నుంచి మటన్, చికెన్ తో చేసిన మాంసాహారం భోజనం తీసుకుని వెళ్లారు. బయటనుంచి తీసుకు వచ్చిన ఆహారం కరోనా రోగులకు ఇవ్వడానికి అవకాశం లేదని, ఇక్కడ క్వారంటైన్ లో ఇస్తున్న ఆహారం మాత్రమే తీసుకోవాలని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. ఆ సమయంలో కరోనా రోగులు, కోవిడ్ కేర్ సెంటర్ సిబ్బంది మద్య వాగ్వివాదం జరిగింది.
మటన్ బిరియానీ, చిల్లీ చికెన్
కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న కొందరు రోగులకు ఇంటి నుంచి తెచ్చిన ఆహారం ఇవ్వడానికి అక్కడి సిబ్బంది నిరాకరించడంతో పెద్దరాద్దాంతం జరిగింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, ఆఫ్ట్రాల్ కొడిగుడ్లతో సరిపెడుతున్నారు, మీరేమనుకుంటున్నారు, మాకు మటన్ బిరియానీ, చిల్లీ చికెన్ కావాలి అంటూ కోవిడ్ కేర్ సెంటర్ లోని కొందరు కరోనా రోగులు రెచ్చిపోయి హంగామా చేశారు.
సైలెంట్ గా ఉంటే చిల్డ్ బీర్లు, 90 ML కావాలంటారు
విషయం తెలుసుకున్న ఉప్పరపేట పోలీసులు రంగప్రవేశం చేశారు. బయట నుంచి తీసుకు వచ్చిన మాంసాహార భోజనం ఇస్తే మళ్లీ కథ మొదటికే వస్తుందని, క్వారంటైన్ లో ఇచ్చిన భోజనం మాత్రమే తినాలని పోలీసులు తేల్చిచెప్పారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే చిల్డ్ బీర్లు, 90 ML కావాలని అడుగుతారని, మర్యాదగా ఉంటే మీకే మంచిదని పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో అంతవరకు క్వారంటైన్ లో రెచ్చిపోయిన కొందరు సైలెంట్ అయ్యారని సమాచారం. ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో విషయం తెలుసుకున్న బెంగళూరు ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారు.