కరోనావైరస్ ఎఫెక్ట్ : వక్రీకరించిన విధి.. వరుడు లేకుండా వధువుతోనే మ్యారేజ్ రిసెప్షన్
త్రిసూర్: పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి రిసెప్షన్కు రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఆ వధువుకు. ముందుగానే బంధువులకు, స్నేహితులకు పెళ్లి గురించి ఆహ్వానం పంపడంతో ఇక చేసేదేమీ లేక రిసెప్షన్కు పెళ్లికూతురు మాత్రమే హాజరైన ఘటన కేరళలోని త్రిసూర్లో చోటుచేసుకుంది. ఇంతకీ పెళ్లికొడుకు ఎందుకు రాలేదు..? చివరి నిమిషంలో ఏం జరిగింది.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
విధి ఆడిన వింత నాటకం
మరి కొన్ని గంటల్లో తాళి కట్టించుకుని ఏడడుగులు వేయాల్సి ఉంది. ఇక్కడే విధి ఆడిన వింత నాటకంలో వధువు పరిస్థితి అయోమయంగా తయారైంది. అప్పటికే ఫిక్స్ అయిన పెళ్లి ముహూర్తం కాస్త రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణం పెళ్లి వేదికపై అన్నీ ఉన్నా పెళ్లికొడుకు మాత్రం మిస్సింగ్ అయ్యాడు. మిస్సింగ్ అంటే అదేదో అదృశ్యం కాలేదు... కరోనా వైరస్ దెబ్బకు వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ ఘటన కేరళలోని త్రిసూర్లో చోటుచేసుకుంది.
చైనా నుంచి కరోనా వైరస్ లక్షణాలతో కేరళకు చేరుకున్న వరుడు
పెళ్లి నిశ్చయం అయిన తర్వాత చైనాకు వెళ్లిన యువకుడు వివాహం కోసం తిరిగి కేరళకు చేరుకున్నాడు. అయితే కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు పెళ్లి కొడుకును అబ్జర్వేషన్లో ఉంచారు. వాస్తవానికి పెళ్లి ఫిబ్రవరి 4వ తేదీన జరగాల్సి ఉండగా... వివాహంను వాయిదా వేసుకున్నారు. కానీ రిసెప్షన్ను మాత్రం నిర్వహించారు. ఎందుకంటే అప్పటికే బంధు మిత్రులకు ఇరు కుటుంబాలు వెడ్డింగ్ కార్డ్స్ పంచేశాయి. అన్నీ ఓకే అనుకున్న సమయంలో విధి వక్రీకరించడంతో వేదికపైకి పెళ్లికొడుకు లేకుండానే పెళ్లికూతురు వచ్చి నిలబడటంతో రిసెప్షన్కు వచ్చిన అతిథులు చెవులు కొరుక్కున్నారు.
28 రోజుల పాటు పబ్లిక్ ఫంక్షన్లకు హాజరు కాకూడదని ఆదేశాలు
ఇక కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు 28 రోజుల పాటు పబ్లిక్ ఫంక్షన్లకు హాజరుకాకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైరస్ సోకితే అది పూర్తిగా నయం అయ్యేందుకు 28 రోజులు సమయం తీసుకుంటుండటంతో ప్రభుత్వం ఈ గడువును విధించింది. ఇదిలా ఉంటే భారత్లో తొలి కరోనా వైరస్ కేసు కేరళలోని త్రిసూర్లోనే బయటపడింది. వూహాన్ నుంచి కేరళకు వచ్చిన ఓ యువకుడిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక బయటపడ్డ మూడు కేసులు కేరళ నుంచి ఉండటంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మొత్తం 190 శాంపిల్స్ను కరోనా వైరస్ నిర్థారణ కోసం పంపగా అందులో 100 శాంపిల్స్కు నెగిటివ్ వచ్చింది.