కరోనా: వరుడు ఔరంగబాద్, వధువు బీడ్, వీడియో కాల్ ద్వారా వివాహం, ఫ్యామిలీస్ హ్యాపీ..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఎక్కడివారు అక్కడే గప్చుప్గా ఉన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా నిలిచిపోయాయి. మరి ఆరునెలల క్రితం పెట్టుకున్న ముహూర్తాన్ని ఏం చేయాలి...? అక్కడివారికి తట్టిన ఐడియా ఇద్దరినీ ఏకం చేసింది. అవును వీడియో కాల్ ద్వారా వధువు-వరుడిని చూసుకొంటుండగా.. ఆచారం ప్రకారం మత పెద్ద వివాహాం జరిపించారు.
ఆర్నెల్ల క్రితం..
మహారాష్ట్రలోని ఔరంగబాద్కి చెందిన మహమ్మద్ మినాజుద్దీన్కు బీడ్కి చెందిన యువతితో ఆరునెలల క్రితం పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి రాలేదు. గతేడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్లో వైరస్ బయటపడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైరస్ జాడ లేకపోవడంతో ఇద్దరికీ పెళ్లి నిశ్చయించారు. తర్వాత వైరస్ బయటపడి.. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఏం చేయాలా అని పెద్దలు ఆలోచించడం ప్రారంభించారు.
వీడియో కాల్..
లాక్ డౌన్ సందర్భంగా ఫంక్షన్ హాళ్లు కూడా మూసివేశారు. ఆస్పత్రి, మెడికల్ షాప్, కొంత సమయం కిరాణా షాపులను మాత్రమే తెరిచేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. సింపుల్గా వెళ్లి చేసుకుందామంటే.. వెళ్లేందుకు కూడా అనుమతి లేదు. దీంతో ఇరువైపుల పెద్దలు చర్చించుకొని.. వీడియో కాల్ ద్వారా పెళ్లి చేయాలని నిశ్చయించారు. ముఫ్తీ ఆనీస్ యుర్ రెహమన్ అనే ఖాజీ ముస్లిం సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి తంతును వీడియో కాల్ ద్వారా జరిపించారు
Recommended Video
హ్యాపీ...
ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వీడియో కాల్ ద్వారా పెళ్లి జరిపించామని ఖాజీ తెలిపారు. దీంతో ఇరువైపుల కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సమయానికి పెళ్లి జరిగిందని, వాయిదా పడకపోవడంతో హ్యాపీ ఉన్నారని చెప్పారు. దీంతోపాటు కనీస ఖర్చుతో పెళ్లి తంతు ముగిసిపోయిందని చెప్పారు. వధూవరుల కుటుంబసభ్యులకు కూడా ఆదాయం మిగిలిపోయిందని పేర్కొన్నారు.