కరోనా ఎఫెక్ట్: రైల్వే శాఖ కీలక నిర్ణయం, 31 వరకు ప్యాసెంజర్ రైళ్లూ బంద్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ఆదివారం(మార్చి 22) రాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు ప్యాసెంజర్ సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కేవలం గూడ్స్ రైల్లు మాత్రమే నడపనున్నామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నుంచే ప్రధాన సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసింతే. తాజాగా అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం వాటి గమ్య స్థానాలను చేరే వరకు అనుమతిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇక కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. స్వచ్ఛందంగా ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో నగరాలు, పట్ణణాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కాగా, కరోనా మృతుల సంఖ్య దేశంలో ఆరుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఇద్దరు మరణించారు. దేశంలో మొత్తం 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కాగా, గత కొద్ది రోజుల క్రితమే రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నా విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 250 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 50కి పెంచుతున్నట్లు రైల్వే శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
సికింద్రాబాద్ సహా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనావ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలో భాగంగా రద్దీని తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.