కరోనా తెచ్చిన తంటా, మాస్క్ వేసుకొని పీఠలెక్కిన వధూవరులు, ఫొటో దిగేప్పుడు కూడా సోషల్ డిస్టన్స్
కరోనా వైరస్ ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప.. ప్రజలు బయటకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఇక పార్టీలు, ఫంక్షన్లు లేనే లేవు. అయితే ఇదివరకే నిశ్చయమైన పెళ్లిలను మాత్రం తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన పెళ్లి మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం వివాహం చేశారే తప్ప.. ఆశించిన గెస్ట్లు లేవు, హంగూ ఆర్బాటం కూడా లేదు.
నో హంగామా..
మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన అక్షయ్ జైన్.. వ్యాపారి. అతని కూతురు కింజల్ జైన్ వివాహాన్ని ముంబైకి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో నిశ్చయం చేశారు. సాధారణంగా పెళ్లి అంటే.. నానా హంగామా ఉంటుంది. స్థాయిని బట్టి పెళ్లిని జరుపుకుంటారు. కానీ కరోనా వైరస్ వల్ల ఆడంబరంగా పెళ్లి చేసే వీలులేదు. అతని ముందు రెండే ఆప్షన్లు కనిపించాయి. ఒకటి పెళ్లి వాయిదావేయడం.. రెండు నిరాడంబరంగా.. పరిమిత అతిథులతో పెళ్లి జరిపించడం. చివరికి రెండో ఆప్షన్కే జైన్ మొగ్గుచూపించారు.
నో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..
పెళ్లికి ముందు జరిగే సంగీత్, రిసెప్షన్ ఇతర కార్యక్రమాలు అన్నింటినీ వాయిదా వేశారు. అంతకుముందు ఇండోర్లో 40 ట్రస్టులకు చెందిన ఆఫీస్ బేరర్లను వివాహానికి ఆహ్వానించారు. కానీ తర్వాత వారిని ఆహ్వానం నుంచి తొలగించారు. కేవలం కొద్దిమందిని, సమీప బంధువులనే మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. అంతేకాదు అధికారులు సూచించిన కరోనా వైరస్కు సంబంధించిన జాగ్రత్త చర్యలు.. మాస్క్ పెట్టుకొని, చేతిలో శానిటైజర్ పట్టుకొని కనిపించారు. పెళ్లిలో ఇలా కనిపించడం కాస్త వింతగానే అనిపించింది.
మాస్క్ వేసుకొన్న వధూవరులు
పెళ్లిలో వధూవరులు కూడా సింపుల్గా డ్రెస్ వేసుకున్నారు. పెళ్లి బట్టలతోపాటు మాస్క్ కూడా ధరించి.. వైరస్ పట్ల తాము అప్రమత్తంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. పూలదండలు కూడా వేసుకోవద్దని నిర్ణయించుకున్నారు. వరుడు వధువు మెడలో తాళి కట్టాక.. ముత్యాలహారం కూడా వేశారు. పెళ్లి ముగిసాక ఫోటోలు దిగే సమయంలో కూడా అందరూ మాస్క్ వేసుకొని కనిపించారు. పక్కన ఉన్నవారు కూడా సోషల్ డిస్టన్స్ పాటించారు. వాస్తవానికి వారు ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ ఇది కూడా తమకు అనుభవంగా మారిందని చెబుతున్నారు.