కోవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ రూ. 1827 కోట్లు విడుదల: ఏపీ, తెలంగాణలకు కేటాయించింది ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి ముప్పు పొంచివున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత కరోనావైరస్ అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థల సన్నద్దత ప్యాకేజీ(ఈసీఆర్పీ) రెండో దశలో భాగంగా 15 శాతం నిధులు అంటే రూ. 1827 కోట్లును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శనివారం విడుదల చేసింది.
ఈసీఆర్పీ-2 కింద మొత్తం రూ. 23,123 కోట్ల నిధుల అందజేతకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ మేరకు నిధులను విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధుల వాటా వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ. 281.98 కోట్లు కేటాయించారు.
ఆ తర్వాత బీహార్కు రూ. 154 కోట్లు, రాజస్థాన్కు రూ. 132 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ. 131 కోట్లు ఇచ్చారు. తెలంగాణకు రూ. 44.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 62.69 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఆరోగ్య వసతులను మెరుగుపర్చడం ద్వారా కరోనాను సమర్థంగా నియంత్రించాలని కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనా పరీక్ష నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు బాధితులను వేరుగా ఉంచేలా కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలు, కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. డివిజన్ స్థాయిలోని చికిత్స కేంద్రాల్లో పడకలను, పీపీఈ కిట్లు వంటి సామాగ్రిని సమకూర్చుకోవాలి. అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఆక్సిజన్ లభ్యతను పెంచుకోవాలని సూచించింది.
ఇది ఇలావుండగా, కేరళలో కరోనా కేసులు ఉధృతి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 20,624 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 80 మంది మరణించారు. రోజువారీ కేసులు 20వేలు దాటడం వరుసగా ఇది ఐదో రోజు కావడం గమనార్హం. కేరళలో కరోనా పాజిటివిటీ రేటు 12.31 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 64వేల యాక్టివ్ కేసులున్నాయి.