పుణెలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 2వ దశ ట్రయల్స్ ప్రారంభం: 17 మందికి టీకా
పుణె: రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగాలు భారత దేశంలో కొనసాగుతున్నాయి. తాజాగా, పుణె నగరంలోని నోబెల్ ఆస్పత్రిలో వీటి ప్రయోగాలను ప్రారంభించారు. గత మూడు రోజులుగా 17 మంది వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ను అందించిన అధికారులు, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ హెచ్కే సాలే తెలిపారు.
రెండో దశలోనూ వాలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్ను అందిస్తామని ఆయన వెల్లడించారు. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను భారత్లో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, మనదేశంలో ఏదైనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే.. వ్యాక్సిన్కు సంబంధించి రెండు, మూడో దశ ప్రయోగాలను ఇక్కడ కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగానే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్పుత్నిక్ వీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అంతేగాక, ప్రయోగాల విజయవంతం అనంతరం పది కోట్ల డోసులను భారత్లో సరఫరా చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్సెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇక మరో సంస్థ హెటిరోతోనూ ఏటా పదికోట్ల డోసుల ఉత్పత్తికి స్పుత్నికి్ వీ ఒప్పందం చేసుకుంది.
కాగా, మనదేశంలో స్పుత్నిక్ వీ ప్రయోగ దశలో ఉండగా.. రష్యాలో మాత్రం ఇప్పటికే వేల మందిపై ప్రయోగించారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల విశ్లేషణలో ఈ వ్యాక్సిన్ దాదాపు 92 శాతానికిపైగా సమర్థత కలిగినట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇప్పటికే ఆస్ట్రాజెనికాతోపాటు స్వదేశీ వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి.