కరోనా: స్పీకర్ ఆదేశించారు.. గౌతమ్ గంభీర్ పాటించారు.. ఎంటంటే..?
ఔను.. ఈస్ట్ ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పీకర్ ఓం బిర్లా మాటను పాటించారు. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోన్న నేపథ్యంలో ఒక్కో ఎంపీ తన నియోజవర్గం కోసం ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి అందజేయాలని స్పీకర్ ఇటీవల సూచించారు. ఇదివరకే కొందరు ఎంపీలు ఆయా ప్రభుత్వాలకు అందజేయగా.. మరికొందరు స్పందిస్తున్నారు. వైరస్పై పోరాడేందుకు ఇదివరకే స్పందించిన బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. మరోసారి రియాక్టయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మత ప్రార్థనలతో దేశవ్యాప్తంగా కూడా ఆమాంతంగా పెరిగాయి. దీంతో ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ వెంటనే స్పందించారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి రూ.50 లక్షలు అందజేశారు. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ను నిరోధించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు ఎంపీలు తమ వంతుగా రూ.కోటి అందజేయాలని కోరారు. అందుకు ఒక్కో ఎంపీ స్పందిస్తున్నారు.
ఇదివరకే గౌతం గంభీర్ రూ.50 లక్షలు ఇవ్వగా.. తాజాగా మరో రూ.50 లక్షలు అందజేస్తున్నానని ప్రకటించారు. మరొసారి గంభీర్ విరాళం అందజేయడాన్ని బట్టి చూస్తే స్పీకర్ పిలుపుమేరకే అనిపిస్తోంది. ఓం బిర్లా సూచనతోనే మరో రూ.50 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ ఆదేశాల మేరకు నడుచుకున్నట్టు సమాచారం.