కరోనా వైరస్ ఎఫెక్ట్: అత్యవసరమైతే తప్ప సింగపూర్ వెళ్లొద్దు, ప్రజలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచన
కరోనా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సింగపూర్ కూడా వెళ్లొద్దని పౌరులకు సూచించింది. అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని పేర్కొన్నది. శనివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించింది.
జపాన్ నౌకలో కరోనా వైరస్ వ్యాప్తి: మరో ఇద్దరు భారతీయులకు పాజిటిక్, ఐదుకు చేరిన సంఖ్య
ప్రస్తుతం చైనా, హంకాంగ్, థాయిలాండ్, సౌత్ కొరియా, సింగపూర్, జపాన్ నుంచి వచ్చే విమానాలను పరీక్షిస్తున్నారు. దేశంలోని 21 ఎయిర్పోర్టులలో ప్రయాణికులను పరీక్షించి, ఓకే అనుకుంటే పంపిస్తున్నారు. సోమవారం నుంచి ఖాట్మండు, ఇండొనేషియా, వియత్నాం, మలేషియా నుంచి వచ్చే ప్యాసెంజర్స్ను కూడా తనిఖీ చేస్తామని స్పష్టంచేసింది. వైరస్ జాడ అంతకంతకూ పెరగడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.
కరోనా వైరస్పై శనివారం క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థితిగతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింగపూర్కు వెళ్లేందుకు ఇదివరకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే వైరస్ అక్కడ కూడా ప్రబలడంతో.. అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని సూచిస్తున్నారు.
సింగపూర్లో 21 వేల 805 మంది ప్రయాణికులను పరీక్షించారు. వీరు కాక విమానాల్లో వచ్చిన 3 లక్షల 97 వేల 152 మంది ప్రయాణికులు, సముద్రమార్గం ద్వారా వచ్చిన 9 వేల 695 మందిని పరిశీలనలో ఉంచారు. దీంతో సింగపూర్ వెళ్లకపోవడమే మంచిదని భారత వైద్యారోగ్యశాఖ అధికారులు భావిస్తోన్నారు. ఈ సమీక్షలో వైద్యారోగ్యశాఖతోపాటు, పౌర విమానయాన శాఖ, రక్షణశాఖ, సమాచార శాఖ, విదేశాంగ శాఖ, హోంశాఖ, ఇమ్మిగ్రేషన్ ప్రతినిధులు, ఐటీబీపీ, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.