కరోనా విలయం: భారత్లో భయానకం.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. వలసకూలీలపై ఆవేదన..
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 60లక్షలు దాటింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్లోనైతే పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారుతోంది. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా, 193 మంది మరణించారు. కేసుల పెరుగుదలలో ఇది సరికొత్త రికార్డు.
Recommended Video
తద్వారా మొత్తం కేసుల సంఖ్య 1.82 లక్షలకు(1,82,143కు) పెరిగింది. ఇందులో 5,164మంది ప్రాణాలు కోల్పోగా, చేరుకుంది. 86,984 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 90వేల యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి రానున్నవేళ కేంద్ర-రాష్ట్రాలు భారీగా సడలింపులు ప్రకటించాయి. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు..
మోదీ ‘మన్ కీ బాత్'
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండం తెలిసిందే. ఇవాళ్టి సందేశంలో మోదీ.. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ 5.0, అన్ లాక్ 1.0, కష్టసమయంలో దేశం ప్రదర్శించిన స్ఫూర్తి, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై కీలక సూచనలుచేశారు.
వాళ్ల బాధ మాటల్లో వర్ణించలేనిది..
‘‘కరోనా మహమ్మారి వల్ల దెబ్బతినని రంగంగానీ, వ్యక్తులుగానీ లేరు. అందరిలోకీ వలస కూలీలు, పేద ప్రజలు చాలా దారుణంగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ల బాధను చెప్పడానికి మాటలు సరిపోవు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే మిగతా ప్రజలు.. తమ సేవా భావంతో కూలీలు, పేదలకు ఆదుకున్నారు. ఎక్కడికక్కడ.. తోచిన రీతిలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం కూడా వలస కూలీల కోసం ఎంతో చేసింది. ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసి, ఆహారసదుపాయాన్ని కూడా కల్పించింది. వలస కూలీల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కూడా కేంద్రం ఆలోచిస్తున్నది. కొత్తగా మైగ్రంట్ కమిషన్ ఏర్పాటుచేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నాం''అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
సేవా భక్తి చాటుకున్నారు..
మిగతా దేశాలతో పోల్చుకుంటే.. అత్యధిక జనాభా కలిగిన భారత్ లో కరోనా వ్యాప్తిని దాదాపుగా కంట్రోల్ చేయగలిగామని మోదీ అన్నారు. ప్రజలందరూ కలెక్టివ్ గా పని చేయడం వల్లే, ప్రభుత్వానికి నూరుశాతం సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని, కరోనా క్రైసిస్ లో దేశం వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విజృంభిస్తున్నవేళ.. దేశం నలుమూలలా వలస కూలీలు, పేదలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారన్నఆయన.. వాళ్లను ఆదుకునే విషయంలో పౌరులు సేవా భక్తిని చాటుకున్నారని, పొరుగువాడికి సేవ చేయాలనే భావన మన సంస్కృతిలోనే ఉందన్నారు. వివిధ మార్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అరుదైన సేవలు నిర్వహించిన కొందరు పేర్లను మోదీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
వరుస దెబ్బలు..
ఒకవైపు కరోనా మహమ్మారితో తలపడుతోన్న దేశానికి అంపన్ తుపాను, మిడతల దాడి రూపంలో వరుస దెబ్బలు తగిలాయని ప్రధాని గుర్తుచేశారు. పెనుతుపాను, మిడతల దాడిలో నష్టపోయిన వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ పథకం వరంగా మారిందని, దాదాపు కోటి మంది నిరుపేదలు చికిత్స పొందారని, అందులో 80 శాతం మంది గ్రామీణులేనని మోదీ తెలిపారు. కరోనా క్రైసిస్ ను అవకాశంగా మలుచుకుని, ఎంతోమంది కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారని, మహిళా స్వయం సహాయక సంఘాలు సైతం మాస్కులు తయారు చేశారని, విద్యా రంగంలోనూ కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
భవిష్యత్తులో ఇలా..
అన్ లాక్ 1.0 నాటికి దేశంలో దాదాపు అన్ని వ్యవస్థలూ పున:ప్రారంభం కావడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని ప్రధాని తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో దేశం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని, ప్రజలు తప్పనిసరిగా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. ‘‘కరోనాపై మనం పోరాడుతున్న తీరును అంతర్జాతీయ సమాజం మెచ్చుకుంది. ఈ పోరాటాన్ని భవిష్యత్తులోనూ మరింత సమర్థంగా కొనసాగించాలి. కరోనా వైరస్ మన శ్వాసక్రియను దెబ్బతీస్తుంది. యోగా ద్వారా ఈ సమస్యను మనం అధిగమించొచ్చు''అని మోదీ చెప్పారు.