Coronavirus: వుహన్ టు ఇండియా, 250 మంది భారతీయులకు 14 రోజుల నిర్భంధం.
నిర్బంధం
కరోనా వైరస్.. చైనాలోని వుహన్లో మొదలైన రక్కసి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. అయితే వైరస్ సోకిన వెంటనే తెలియకపోవడం ఈ వ్యాధికున్న ప్రధాన లక్షణం. వారం తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. తుమ్ములు రావడం/దగ్గు, తీవ్ర జ్వరంతో కరోనా వైరస్ సోకినట్టే భావించాలి. ఈ క్రమంలో హుబీ రాజధాని వుహన్లో ఉంటోన్న భారతీయులను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
250 మంది విద్యార్థులు..
హుబే రాజధానిలో దాదాపు 250 మంది విద్యార్థులు, పరిశోధన చేసే స్టూడెంట్స్, వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెషనల్స్ హుబీ రాజధాని వుహన్లో పనిచేస్తున్నారు. అయితే కరోనా వైరస్ ఇక్కడే బయటపడటంతో వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారు భారతదేశం చేరుకున్న తర్వాత 14 రోజులపాటు నిర్బంధంలో ఉంచాలని చైనాలో భారత రాయబార కార్యాలయ అధికారులు స్పష్టంచేశారు. అప్పుడు వారికి ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించిన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని తేల్చిచెప్పారు.
వారమే కానీ..
వాస్తవానికి కరోనా వైరస్ సోకితే వారం రోజుల్లో బయటపడుతోంది. కానీ ముందుజాగ్రత్త ఇండియన్ ఎంబసీ అధికారులు 14 రోజుల సమయం వారిని నిర్బంధించాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ సోకి చైనాలో ఇప్పటివరకు 130 మంది చనిపోయారు. వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేల చేరుకొంది. ఇందులో న్యూమోనియా కేసులు 4 వేల 515 నమోదయ్యాయని వైద్యులు తెలిపారు.
తరలింపు..
హుబి రాజధానిలో వైరస్ విజృంభించడంతో అక్కడున్న భారతీయులను స్వదేశానికి తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. భారతీయ విద్యార్థుల తరలింపుపై చైనా ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నామని వెల్లడించాయి. వీలైనంత త్వరగా వారిని ఇక్కడినుంచి పంపిస్తామని చెప్పారు. అంతేకాదు విద్యార్థుల కోసం మూడు హాట్ లైన్లు ఓపెన్ చేశామని, విద్యార్థులు తమను సంప్రదించాలని కూడా సూచించారు. ఇందులో భాగంగా తొలుత పంపేవారిని మాత్రం 14 రోజుల నిర్బంధించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Recommended Video
ప్రత్యేక విమానంలో
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో వుహన్లో చిక్కుకొన్న విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక విమానం పంపిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. వుహన్లో భారతీయులే కాదు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాలకు చెందిన వేలాది మంది ఉన్నారు. థాయ్ లాండ్లో 7, జపాన్ 3, దక్షిణ కొరియా 3, అమెరికా 3, వియత్నాం 2, సింగపూర్ 4, మలేషియా 3, నేపాల్ 1, ఫ్రాన్స్ 3, ఆస్ట్రేలియా 4, శ్రీలంకలో ఒక్కరికి వైరస్ సోకింది.