కరోనా: కేంద్రం రూ.15వేల కోట్ల ప్యాకేజీ.. కొవిడ్-19 ఏమర్జెన్సీ రెస్పాన్స్గా..
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం ప్రభుత్వం సూచించింది. వైరస్ తో పోరులో అన్ని విధాలుగా సహాయపడతామని భరోసా ఇచ్చింది. అంతేకాదు, మొత్తం రూ.15వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా మోదీ సర్కారు ప్రకటించింది. ''ఇండియా కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజీ'' పేరుతో ఈ నిధులను గురువారమే విడుదల చేశారు.
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న దరిమిలా, ఆయా రాష్ట్రాల్లోని కరోనా ఆస్పత్రుల్లో సౌకర్యాల పెంపుతోపాటు, దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా మెడికల్ సిబ్బందికి శిక్షణ కోసం కూడా ఈ నిధుల్ని వాడుకోవచ్చని కేంద్రం చెప్పింది. మొత్తం నిధుల్లో(రూ.15వేల కోట్ల)లో దాదాపు సగం, అంటే, రూ.7,774 కోట్లను అచ్చంగా ఎమర్జెన్సీ అవసరాలకు మాత్రమే వాడుకోవాలని చెప్పింది. మిగతా మొత్తాన్ని రాబోయే నాలుగేళ్ల అవసరాలకు వినియోగించాలని సూచించింది. మిషన్ మోడ్ లో నిర్వహించే ఈ పనులన్నీ కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతాయని తెలిపింది.
ఎమర్జెన్సీ ప్యాకేజీ డబ్బును.. కొవిడ్-19 రోగులకు సేవలందించే వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్, ఐసోలేషన్, ఐసీయూల ఏర్పాటు, వెంటిలేటర్లు, ఇతర అత్యవసర పరికరాల కొనుగోలుకు వినియోగించాలని కేంద్రం చెప్పింది. ప్రస్తుత, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ల్యాబ్స్ ఏర్పాటు, పరిశోధనలకు అయ్యే ఖర్చులు, మెడికల్ సిబ్బందికి శిక్షణను కూడా ఈ నిధుల ద్వారానే చేపట్టాలని సూచించింది. ఇది కాకుండా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతోన్న పేదల కోసం కేంద్రం రూ.1.75లక్షల ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గురువారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 5,865కు పెరిగింది. అందులో 169 మంది ప్రాణాలు కోల్పోగా, 478 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 591 కేసులు నమోదుకావడం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 1300 కేసులు, తమిళనాడులో 800, ఢిల్లీలో 670 కేసులు నమోదయ్యాయి.