కరోనా కలవరం: కేవలం 4 రోజుల్లోనే 10వేల కేసులు నమోదు, 53వేలు దాటి..
న్యూఢిల్లీ: భారతదేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి ఏడు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతుండటంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.
'వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’
దేశ వ్యాప్తంగా 52, 800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడు(మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లోనే 43వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇది 80శాతం కంటే ఎక్కువగా ఉంది.
బుధవారం వరకు 50వేల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం ఒక్క రోజులోనే 3500 కొత్త కేసులు వీటికి జత కలిశాయి. ఒక్క ముంబై నగరంలోనే 10వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో 40వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేవలం గత నాలుగు రోజుల్లోనే 10 వేలకు పైగా కేసులు నమోదయయాయి.
దేశంలోని ఆ ఏడు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లోకూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలను కూడా కలుపుకుంటే దేశంలో 90 శాతం కేసులకు సమానంగా మారింది. దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో 16, 758, గుజరాత్ రాష్ట్రంలో 6625, ఢిల్లీలో 5532, తమిళనాడులో 4829, రాజస్థాన్ రాష్ట్రంలో 3224, మధ్యప్రదేశ్ లో 3138, ఉత్తరప్రదేశ్లో2998, ఆంధ్రప్రదేశ్లో 1777, పంజాబ్ లో 1526, పశ్చిమబెంగాల్లో 1456 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లోనే కరోనా మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.