Coronavirus:భారత్లో మాస్కుల కొరత.. ఎన్ని కావాలో తెలుసా, డబ్బులు కూడా లేవట..!
న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు భారత్లో కూడా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ లాక్డౌన్కు ఆదేశించాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం రహదారులపై కనిపిస్తున్నారు. ఇక కరోనావైరస్ను పారద్రోలాలంటే ఇళ్లకు పరిమితం కావడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం మాత్రమే మార్గాలు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక భారత్లో అంతకంతకూ పెరిగిపోతున్న కేసులకు చికిత్స అందించాలంటే మెడికల్ ఎక్విప్మెంట్ చాలడం లేదు. ఇందులో ముఖ్యంగా ముఖానికి ధరించాల్సిన ఫేస్ మాస్క్లు కొరత ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.
మాస్కుల కోసం..
కరోనావైరస్ వ్యాప్తి తగ్గాలంటే ముఖానికి ధరించాల్సిన మాస్క్లలో కొరత ఏర్పడుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే భారత్కు 38 మిలియన్ మాస్కులు, 6.2 మిలియన్ వ్యక్తిగత సంరక్షణ ఎక్విప్మెంట్లు అవసరం పడతాయని అంచనా. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మాస్కులను ఇతర అవసరాలను సప్లయ్ చేయాల్సిందిగా కొన్ని వందల కంపెనీలను ఆశ్రయించినట్లు సమాచారం. ఇక కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్దీ... మాస్కులకు సైతం డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాదు హెల్త్ వర్కర్లకు కూడా మాస్కులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారు ఫిర్యాదులు కూడా పెరిగాయి.
హెల్త్ కిట్స్ కోసం 730 కంపెనీలను ఆశ్రయించిన సంస్థ
ఇక మహమ్మారిపై పోరు సాగించేందుకు ముందుగా వ్యక్తిగత సంరక్షణ అవసరమని పేర్కొంటూ ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ అనే సంస్థ దాదాపు 730 కంపెనీలను ఆశ్రయించి మాస్కులు, వెంటిలేటర్లు, ఐసీయూ మానిటర్స్, టెస్టింగ్ కిట్స్ అందజేయాలని కోరినట్లు మార్చి 27న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటి వరకు 319 కంపెనీల నుంచి సమాధానం రాగా మిగతా సంస్థలు రెస్పాండ్ కాలేదని వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్లో 1030 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 27 మంది మృతి చెందారు. దీంతో ఈ వారం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. కఠిన చర్యలు తీసుకోకపోతే భారత ఆరోగ్య వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించింది.
అందుబాటులో 9.1 మిలియన్ మాస్కులు
ఇక అందుబాటులో ఉన్న మాస్కుల సంఖ్య 9.1 మిలియన్గా ఉండగా వ్యక్తిగత సంరక్షణ పరికరాలు లేదా ఎక్విప్మెంట్స్ 8లక్షలుగా ఉన్నాయని ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. అయితే ఇది చాలదని ఇంకా 38 మిలియన్ మాస్కులు కావాలని ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ చెబుతోంది. ఇందులో 14 మిలియన్ మాస్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం అవుతుండగా మిగతావి కేంద్ర ప్రభుత్వంకు అవసరమవుతాయని వెల్లడించింది. ఇక సంరక్షణ కిట్స్ విషయానికొస్తే అవి 6.2 మిలియన్గా ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ సమాచారం ఏడు రాష్ట్రాలకు సంబంధించింది మాత్రమే అని మిగతా రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
Recommended Video
దక్షిణ కొరయా సంస్థల నుంచి టెస్టు కిట్స్ దిగుమతి
ఇదిలా ఉంటే ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ అనే సంస్థ పలు కంపెనీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తుంది. కరోనాకేసులు పెరుగుతున్న కారణంగా ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఎక్కడా కొరత రాకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. అంతేకాదు ఈ సంస్థ భారత్లోని ప్రైవేట్ కంపెనీలతో పాటు దక్షిణ కొరయా సంస్థల నుంచి కూడా కొన్ని టెస్టు కిట్స్ను దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ప్రొటెక్టివ్ కిట్స్ కొరతతో డాక్టర్లు కూడా కరోనావైరస్ పేషెంట్లు ఉన్న వార్డులకు వెళ్లాలంటే జంకుతున్నారు. కరోనా వైరస్ నుంచి తాము పారిపోవడం లేదని.. ప్రజలకు చికిత్స అందించాల్సిన బాధ్యత తమపై ఉందని అయితే.. కొన్ని జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని డాక్టర్లు చెబుతున్నారు.