కరోనా: ‘మర్కజ్’తో లెక్కతప్పిందన్న కేంద్రం.. మరణాలపై షాకింగ్ రిపోర్ట్.. స్టేజ్-3లో ఉన్నామా?
దేశంలోనే అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ గా గుర్తింపు పొందిన ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రభావం గురించి ఇప్పటిదాకా మీడియాలో చాలా రిపోర్టులు వచ్చాయి. పలు రాష్ట్రాలు తమ బులిటెన్లలో మర్కజ్ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తొలిసారి మర్కజ్ ప్రభావాన్ని అధికారికంగా వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా కొవిడ్-19 పాజిటివ్ కేసులు 4,067 నమోదుకాగా, వాటిలో 1,445 మంది తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గొన్నవాళ్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా మరణాలతోపాటు స్టేజ్-3పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇలా లెక్క తప్పింది..
‘‘దేశంలో కొవిడ్19 కేసులుగానీ, మరణాలపైగానీ మాకు స్పష్టమైన అవగాహన, అంచనాలు ఉన్నాయి. కనీసం 7.4రోజుల వ్యవధిలో నంబర్లు రెట్టింపవుతాయని భావించాం. కానీ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లీగీ జమాతే వ్యవహారంతో మా లెక్కలు తప్పాయి. అతివేగంగా, కేవలం 4.1రోజుల్లోనే కేసులు, మరణాల సంఖ్య రెట్టింపయింది. ఒక్క ఆదివారం రోజే భారీగా మరణాలు, కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలాంటిదో మీరే ఊహించండి'' అని లవ్ అగర్వాల్ చెప్పారు.
డెడ్లీ సండే..
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల వివరాల బ్రీఫింగ్ లో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర అధికారి అగర్వాల్.. ఆదివారం ఒక్కరేజే 696 కొత్త కేసులు వెలుగులోకిరావడంతోపాటు 32 మంది చనిపోయారని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,067కు, మరణాల సంఖ్య 109కి పెరిగిందన్నారు. అయితే, పీటీఐ లాంటి ప్రామాణిక న్యూస్ ఏజెన్సీల లెక్కలు మాత్రం దేశవ్యాప్తంగా 4,111 మందికి వైరస్ సోకిందని, మొత్తం 126 మంది చనిపోయారని పేర్కొనడం గమనార్హం. ఇప్పటిదాకా చనిపోయినవారికి సంబంధించి అగర్వాల్ ఆసక్తికర విషయాలు చెప్పారు..
చనిపోయింది వీళ్లే..
Males account for 73 per cent deaths due to COVID-19, while females 27 per cent, కేంద్రం లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 109 మంది చనిపోయారని, వాళ్లలో 73 శాతం పురుషులు, 27 శాతం మహిళలు ఉన్నారని అగర్వాల్ చెప్పారు. చనిపోయినవాళ్లలో 86 శాతం మంది ఇదివరకే వేరే జబ్బులతో బాధపడుతున్నవాళ్లేనని, మొత్తం మృతుల్లో 63 శాతం మంది 60ఏళ్ల వయసుపైబడినవారేనని చెప్పారు. మృతుల్లో 40 నుంచి 60 ఏళ్లలోపున్న వ్యక్తులు 30 శాతం మందేనని, 40 ఏళ్లలోపువాళ్లు కేవలం 7 శాతం మందేనన్నారు. దీన్ని బట్టి చైనా, యూరప్, అమెరికాలాగే ఇండియాలోనూ పెద్ద వయసున్నవాళ్లే ఎక్కువగా కరోనా కాటుకు గురవుతున్నట్లు వెల్లడైంది.
లోకల్ వ్యాప్తి ఉన్నట్లేగా?
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కమ్యూనిటి ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) జరుగుతున్నదని డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఆయన ఆలిండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ కావడంతో ఆ కామెంట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. డాక్టర్ గులేరియా కామెంట్లపై కేంద్ర అధికిరా అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది, కేంద్రం చెబుతున్నదీ అదే మాట. ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడాన్ని ‘లోకలైజ్డ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్' గానే భావించాల్సిఉంటుంది''అని వివరణ ఇచ్చారు.
Recommended Video
వ్యాక్సిన్ పై ఇప్పుడే చెప్పలేం..
కొవిడ్-19 వ్యాధికి మందు కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగానే, తాత్కాలిక పరిష్కారంగా చాలా చోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడుతున్నారు. మలేరియాను నయం చేసే ఈ వ్యాక్సిన్ ను పంపాల్సిందిగా అమెరికా చేసిన అభ్యర్థనపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే అమెరికన్ డాక్టర్లలాగే ఇండియా డాక్టర్లు సైతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై విశ్వాసాన్ని ప్రదర్శించడంలేదు. కొవిడ్-19కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కచ్చితంగా పనిచేస్తుందనడానికి తగిన రుజువులు లేనందున ఆ డ్రగ్ వాడొచ్చని ఇప్పుడే చెప్పలేమని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అభిప్రాయపడింది.