చైనా కరోనావైరస్: ఈ-వీసాలను తాత్కాలికంగా నిలిపేసిన భారత్, తప్పనిసరి అయితే..
న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో 300 మందికిపైగా మృతి చెందారు. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాతోపాటు 25 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ-వీసాల(ఆన్లైన్ వీసాలు)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. చైనీయులు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుందని బీజింగ్లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఇప్పటికే ఈ-వీసాలు జారీ చేసిన వారికి కూడా అవి చెల్లవంటూ సమాచారం అందించినట్లు పేర్కొంది. ఎవరైనా ఖచ్చితంగా భారత్కు వెళ్లాల్సి ఉంటే మాత్రం అందుకు తగిన కారణాలతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.
కాగా, ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్ నగరం నుంచి 600 మందికిపైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతోంది.
ఇది ఇలావుంటే, చైనాలో కరోనా బారిన పడి ఇప్పటికే 300 మందికిపైగా మృతి చెందారు. 14562 మంది ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరో 300మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ ఇప్పటికే చైనాతోపాటు 25 దేశాలకు విస్తరించింది. భారత్లో రెండు కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఈ రెండు కేసులు కూడా కేరళలోనే కావడం గమనార్హం.