అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!
న్యూఢిల్లీ: కరోనావైరస్ కోసం ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం వ్యాక్సిన్ తొలుత ఎవరికివ్వాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా 30 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఎవరికి ముందు ఇవ్వాలో తేల్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది. మొదటగా అత్యధిక కేసులున్న ప్రాంతాల్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ముందు వరసలో ఉన్న హెల్త్ వర్కర్లకు , పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని భావిస్తోంది. అనంతరం వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా కరోనా వ్యాక్సిన ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
దేశంలో కరోనా పరీక్షలు 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది: కిరణ్ మజుందార్ షా
60 కోట్ల వ్యాక్సిన్ డోసులు
మొత్తం మీద 60 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలోనే బూస్టర్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక డోస్ ముందుగా తీసుకునేవారిని నాలుగు వర్గాలుగా విభజించారు. 50-70 లక్షల మంది హెల్త్ వర్కర్లు, మరో 2 కోట్లకు పైగా కరోనా వారియర్లకు ఇందులో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. 50 ఏళ్ల పైబడిన 26 కోట్ల మందికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అ తర్వాత ఇతర జబ్బులతో బాధపడుతూ 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబర్ నెలాఖరు కల్లా...
ప్రస్తుతం భారత్లో మూడు వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇందులో ఆక్స్ఫర్డ్కు చెందిన ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్ అడ్వాన్స్ స్టేజ్ అయిన మూడవ దశలో ఉంది. దీన్ని పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. నవంబర్ చివరికల్లా లేదా డిసెంబర్ తొలివారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు, ఇతర కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ అమలు ప్రణాళికను కోవిడ్-19 అడ్మినిస్ట్రేషన్ విభాగం రూపొందించింది. తొలి దశలో 23 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది.
జాబితా సిద్ధం చేయనున్న నిపుణుల కమిటీ
డ్రాఫ్ట్ ప్లాన్ ప్రకారం నిపుణుల కమిటీ ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య రంగాల్లో పనిచేస్తున్న 70 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 11 లక్షల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, 8 లక్షల మంది ఆయుష్ ప్రాక్టీస్ చేసేవారు, 15 లక్షల మంది నర్సులకు, 7 లక్షల మంది ఏఎన్ఎంలకు, 10 లక్షల మంది ఆశావర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. అక్టోబర్ నెలఖరు కల్లా ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలనేదానిపై ఒక జాబితా సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
Recommended Video