కరోనా: ప్రమాదం అంచున ఇండియా.. రంగంలోకి ఆర్మీ.. షాకింగ్ ఫిగర్స్.. ఏం జరుగుతోంది?
''నా తలరాత దేవుడే నిర్ణయించాడు.. తన దగ్గరికి నన్ను పిలుస్తున్నాడు''.. ఢిల్లీ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని, స్వదేశం సౌతాఫ్రికాలో చనిపోయిన ఓ మతగురువు చివరి మాటలివి. ఆననొక్కడేకాదు, అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా 'చావులకు సిద్ధంగా ఉండండి'అని ప్రజలకు పిలుపునిచ్చింది. అడ్డూఅదుపు లేకుండా మహమ్మారి కరోనా సృష్టిస్తోన్న విలయాన్ని, బలితీసుకుంటున్న జనాన్ని చూస్తే, ఎంతటివాళ్లైనా షాక్ తినాల్సిందే. అదిగో, ఇలాంటి స్థితి మనదేశంలో ఉత్పన్నం కాకూడదనే పాలకులు, ప్రభుత్వ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాళ్లకు తోడుగా.. ప్రజలకు గొప్ప భరోసా కల్పిస్తూ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.
100కు చేరువైన మరణాలు..
ఇండియాలో నిజాముద్దీన్ మర్కజ్ హాట్ స్పాట్ నుంచి భయానకరీతిలో వైరస్ వ్యాపించడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం మూడింతలు పెరిగింది. ఆదివారం ఉదయం నాటికి కేసుల సంఖ్య 3,705కాగా, మరణాలు 99కి పెరిగాయి. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య(283) తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. వైరస్ టెస్టులపై వ్యక్తమవుతోన్న అభిప్రాయలు మరింత భయంకలిగించేలా ఉన్నాయి.
4 రాష్ట్రాలు తప్ప..
నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ తప్ప మనదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైరస్ విలయతాండవం చేస్తున్నది. మహారాష్ట్రలో అత్యధికంగా 635 కేసులు నమోదుకాగా, తమిళనాడు, ఢిల్లీల్లోనూ కేసుల సంఖ్య 500కు దగ్గరగా ఉంది. 272 కేసులతో తెలంగాణ ప్రస్తుతానికి ఐదో స్థానంలో ఉండగా, ఏపీలో ఇప్పటిదాకా 226 కేసులు నమోదయ్యాయి. మర్కజ్ ఎఫెక్ట్ కారణంగా వచ్చే 10 రోజులు కూడా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే..
ప్రమాదం అంచున దేశం..
చైనాలో కరోనా వైరస్ పుట్టినప్పటి నుంచే.. అది ఇండియాకు ప్రమాదం కొనితెస్తుందని, ప్రభుత్వం అప్రమత్తం కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిస్తూ వచ్చారు. ఆయన అంచనా వేసినట్లే మన దేశంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. అంతోనే రాహుల్ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. కరోనా వైరస్ టెస్టులు జరుగుతున్న తీరు.. ఇండియాను మరింత ప్రమాదంలోకి నెట్టేసేలా ఉందని ఆందోళన చెందారాయన.
ప్రజల్లో ఎంతమందికి వైరస్ బారినపడ్డారని తెల్సుకునేందుకు సౌత్ కొరికాలో.. ప్రతి 10లక్షల మందిలో 7,622 మందికి టెస్టులు చేస్తున్నారని, ఇటలీలో 7,122 మందికి, అమెరికాలో 2732 మందికి, పాకిస్తాన్ లో 67 మందికి టెస్టులు చేస్తుండగా ఇండియాలో మాత్రం.. ప్రతి మిలియన్ మందిలో కేవలం 29మందికే కరోనా టెస్టులు చేస్తుండటం మోదీ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు. ఈలోపే..
రంగంలోకి ఆర్మీ..
కరోనా విషయంలో ఆందోళన నెలకొన్నవేళ.. ప్రజలకు భరోసా కల్పిస్తూ ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా 51 ఆర్మీ ఆస్పత్రులకు ‘కరోనా ఆస్పత్రులు'గా మార్చేసింది. మొత్తం 8,500 మంది ఆర్మీ డాక్టర్లను కరోనా సేవల్లోకి దింపింది. ఇప్పటిదాకా క్వారంటైన్ సెంటర్లుగానే పనిచేసిన ఆర్మీ ఆస్పత్రుల్లో ఆదివారం నుంచి కొవిడ్-19కు చికిత్స కూడా అందజేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, కొచ్చి, కోల్ కతా, కాన్పూర్ తదితర 51 నగరాల్లోని ఆర్మీ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశామని జనరల్ మనోజ్ నరవణె తెలిపారు. వీటితోపాటు మరో 15 సెంట్లర్లలోనూ.. అత్యవసర పరిస్థితులకు పనికొచ్చేలా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
డీఆర్డీవో ఎన్99 తయారీ..
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఎన్95 మాస్కుల కొరత ఏర్పడ్డకారణంగా వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ కొరతను పూడ్చుతూ, డిఫెన్స్ రీసెర్చ్ సంస్థ డీఆర్ డీవో ఎన్99 అనే కొత్తతరహా, రక్షణాత్మక మాస్కుల్ని తయారుచేసింది. రోజుకు 20వేల మాస్కులు తయారవుతున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఎయిర్ ఫోర్స్ కూడా తన వంతు సాయం చేస్తున్నదని, ఇప్పటిదాకా 51 టన్నుల మెడిసిన్ ను రవాణా చేసిందని, అత్యవసర సేవల కోసం 28 తేలికపాటి విమానాలు, 21 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచామని డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. దేశీయంగానేకాదు, మన పొరుగురాజ్యాలైన శ్రీలంక, మాల్దీవులు, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నేపాల్ లోనై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారీ సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.