ఇండియన్ ఆర్మీలో కరోనా.. 200 మంది జవాన్ల ఐసోలేషన్? పాకిస్తాన్లో 254 పాజిటివ్ కేసులు..
మహమ్మారి కరోనా.. భద్రతాబలగాలను సైతం భయపెడుతోంది. కేంద్రపాలిత ప్రాంతం లేహ్ లోని 'లదాక్ స్కౌట్స్' రెజిమెంట్ కు చెందిన ఓ జవానుకు వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఇండియన్ ఆర్మీ ఉలిక్కిపడింది. తండ్రి ద్వారా ఆ జవాన్ కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని అధికారులు బుధవారం వెల్లడించారు. మన పొరుగుదేశం పాకిస్తాన్ లోనూ కరోనా తాండవం చేస్తున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య 254కు పెరిగింది. కరోనా విలయం తర్వాత చైనాకు మొట్టమొదటి అంతర్జాతీయ అతిథిగా పాకిస్తాన్ అధ్యక్షుడు వెళ్లారు.
జవాన్ ఫ్యామిలీ మొత్తం..
‘లదాక్ స్కౌట్స్' రెజిమెంట్ కు చెందిన 34 ఏళ్ల లాన్స్ నాయక్.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు సెలవులో ఉన్నాడు. అదే సమయంలో ఇరాన్ తీర్థయాత్ర ముగించుకుని వచ్చిన తండ్రితో సన్నిహితంగా మెలిగాడు. మార్చి 2న తిరిగి డ్యూటీలో చేరిన తర్వాత విపరీతమైన దగ్గు, జ్వరం రావడంతో అతణ్ని ఎస్ఎన్ఎం ఆస్పత్రిలో చేర్పించారు. ముందు జాగ్రత్త చర్యగా జవాన్ తల్లిదండ్రులు, భార్య, సోదరి, కూతురును కూడా వైద్యులు ఐసోలేషన్ లో ఉంచారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్న మరో 200 మంది జవాన్లను కూడా ముందు జాగ్రత్తచర్యగా ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిసింది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
మూడో దశతో మరింత ప్రమాదం..
మహమ్మారి కరోనా మొత్తం నాలుగు దశల్లో విస్తరిస్తుందని, ప్రస్తుతం మన దేశంలో రెండో దశ (లోకల్ ట్రాన్స్మిషన్)లో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. ఇప్పటిదాకా బయటపడుతున్న కేసులన్నీ విదేశాల్లో వైరస్ బారినపడి వచ్చినవేనని, అలా కాకుండా, వైరస్ తనంతటతాను పుడితే దాన్ని మూడో దశ.. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గా పిలుస్తారని, అంతర్జాతీయ సరిహద్దులు మూసేసిన నేపథ్యంలో భారత్ లో మూడో దశ రాదనే అనుకుంటున్నామని భార్గవ అన్నారు. ఇక..
పాక్ విలవిల..
పొరుగుదేశం పాకిస్తాన్ లో కరోనా విజృంభన కొనసాగుతున్నది. బుధవారం నాటికి అక్కడ 254 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సింధ్ ప్రావిన్స్ లో అత్యధికంగా 181, ఇస్లామాబాద్ లో అత్యల్పంగా రెండు కేసులు నమోదయ్యాయి. అయితే ఆ దేశంలో ఇప్పటిదాకా ఒకరు మాత్రమే చనిపోయారు. వైరస్ వ్యాప్తి భయంతో ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ విధించింది. స్కూళ్లు మూసివేత, పబ్లిక్ గ్యాదరింగ్స్ పై నిషేధం తదితర నిర్ణయాలు అమలవుతున్నాయి.
Recommended Video
కోలుకుంటోన్న చైనా..
ఇతర దేశాల్లో కలకలం సృష్టిస్తోన్న కరోనా వైరస్.. తన పుట్టిల్లు చైనాలో మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గిపోతున్నది. కొత్త కేసుల నమోదు రేటు క్రమంగా తగ్గిపోతున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే, కరోనా విలయం తర్వాత చైనాకు మొదటి అంతర్జాతీయ గెస్టుగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ ఆల్వీ బీజింగ్ లో పర్యటించారు. బీజింగ్ లో చైనా చీఫ్ జిన్ పింగ్.. ఆరిఫ్ కు ఘనస్వాగతం పలికారు. ఇద్దరూ కీలక ద్వైపాక్షిక చర్చలు చేశారు.