Coronovirus:వారిని రప్పించేందుకు ఇండియన్ ఎంబసీ ప్రయత్నాలు..పాస్పోర్టులు లేక..!
న్యూఢిల్లీ: చైనాలో వెలుగు చూసిన మహమ్మారి కరోనా వైరస్ పలు దేశాలకు విస్తరించింది. ఇప్పటికే 80కిపైగా ఈ వైరస్ బారిన పడి మృతిచెందారు. ఇక చైనాను కరోనా వైరస్ వణికిస్తుండటంతో అక్కడ నివసిస్తున్న భారతీయులను తిరిగి భారత్కు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది మన ప్రభుత్వం. ఈ దిశగా చైనాలోని ఇండియన్ ఎంబసీ చర్యలు చేపడుతోంది.
పాస్పోర్టు వివరాలు ఇవ్వండి
చైనాను కరోనా వైరస్ కబళిస్తున్న నేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసుకునేందుకు వెళ్లిన భారతీయులపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. వారిని భారత్కు తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ ఉండేందుకు వారి పాస్పోర్టులను చైనా అధికారులకు సబ్మిట్ చేసిన భారతీయులందరూ తమ పాస్పోర్టులను తిరిగి పొందే సమయం లేకపోవడంతో ఇండియన్ ఎంబసీ ఒక ఆలోచన చేసింది. పాస్పోర్టులను చైనా అధికారులకు సబ్మిట్ చేసిన భారతీయులంతా... వారి పేరు, పాస్పోర్టు నెంబరు, ఎవరికి పాస్పోర్టు సబ్మిట్ చేశారు, ఏ తేదీన సబ్మిట్ చేశారో అనే వివరాలను ఇవ్వాలని ఇండియన్ ఎంబసీ తెలిపింది. అంతేకాదు ఆ వివరాలు ఎవరికి ఇవ్వాలో కూడా ఇండియన్ ఎంబసీ వెల్లడించింది
ప్రత్యేక బోయింగ్ విమానం ఏర్పాటు
మరోవైపు చైనా నుంచి భారత్కు అక్కడ నివాసముంటున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు చెందిన ఓ బోయింగ్ విమానంను కూడా చైనాలో సిద్ధం చేసింది. ఒక్కసారి భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే అక్కడి భారతీయులను విమానం ఢిల్లీకి తీసుకొస్తుంది. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరోనా వైరస్ తొలిసారిగా వూహాన్ నగరంలో బయటపడటంతో అక్కడి విమానాశ్రయాన్ని చైనా ప్రభుత్వం జనవరి 23న మూసివేసింది.
చైనాలో చిక్కుకుపోయిన భారతీయులు
వూహాన్ నగరంతో పాటు మరో 12 నగరాల్లో కూడా కరోనా వైరస్ ఉన్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. దీంతో చాలా మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వెంటనే వారిని భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు చైనాలో ఉన్న ఒక్క భారతీయుడికి కూడా ఇంకా ఈ వైరస్ సోకలేదు.
చైనాలో 80 మంది మృతి.. ఇతర దేశాల్లో 43 కేసులు
ఇక చైనా నుంచి భారత్కు చేరుకున్న దాదాపు 29,707 మందిని వైరస్ టెస్టులను నిర్వహించినట్లు కేంద్రం చెబుతోంది. అయితే వీరిలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఇక కేరళ మహారాష్ట్రలో కలిపి 100 మందిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు సమాచారం. బీహార్ నుంచి ఒక అమ్మాయి, రాజస్థాన్కు చెందిన ఓ డాక్టరు చైనా నుంచి వచ్చారని వారిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం రావడంతో వారిని పరీక్షిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు చైనాలో కరోనా వైరస్ బారిన పడి 80కి పైగా మృత్యువాత పడగా మరో 2800 మంది చికిత్స పొందుతున్నారు. ఇది కాకుండా ఇతర దేశాల నుంచి 43 కరోనా కేసులు బయటపడ్డాయి.