Coronavirus: కరోనా వైరస్కు మందు దొరికిందా? పూర్తిగా కోలుకున్న కేరళ యువతి: త్వరలో డిశ్చార్జి..
తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన కేరళకు చెందిన ఓ యువతి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. మూడు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. త్వరలోనే ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. మనదేశంలో నమోదైన తొలి కరోనా వైరస్ కేసు అది. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఆమె రక్త నమూనాలను పరీక్షించగా.. వైరస్ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేసింది.
Coronavirus: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ: పోరాటానికి సహకరిస్తామంటూ.. !
మనదేశంలో తొలి కరోనా వైరస్ కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్ నుంచి స్వస్థలానికి చేరుకున్న వైద్య విద్యార్థినికి వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. త్రిశూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీన ఆమె ఆసుపత్రిలో చేరారు. వైరస్ సోకినప్పటి నుంచీ పలుమార్లు రక్త పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు. నాలుగు దశల్లో రక్త పరీక్షలను పూర్తి చేశారు. అయిదో విడత రక్త పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తేలింది.
ఆరో విడత కూడా రక్త పరీక్షలను నిర్వహించామని, వాటిని పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించామని అన్నారు. ఈ నివేదిక అందిన తరువాత వైద్య విద్యార్థినిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తామని చెప్పారు. అయిదో విడత రిపోర్ట్ సందర్భంగా కరోనా వైరస్ మటుమాయమైందనే విషయాన్ని వైరాలజీ సంస్థ కూడా నిర్ధారించిందని కేరళ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ వైద్య విద్యార్థిని త్రిశూర్ మెడికల్ కాలేజీలోనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. మరి కొన్ని రోజుల పాటు అన్ని రకాల పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఆరో విడతలో పంపించిన రక్త పరీక్షల నమూనాలు మరో రెండురోజుల తరువాత అందే అవకాశం ఉందని అన్నారు. అవన్నీ నెగెటివ్గా వచ్చిన తరువాతే డిశ్చార్జి చేస్తామని అన్నారు. ఆమెకు నయం కావడానికి ఎలాంటి మందులు, వైద్య చికిత్సను అనుసరించారనే విషయం ఇంకా తెలియ రావాల్సి ఉందని, దీని మీద త్రిశూర్ మెడికల్ కాలేజీ నుంచి పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకుంటున్నామని అధికారులు చెప్పారు. వైద్య విద్యార్థిని శరీర తత్వం మీద ఆధారపడి ఈ వైద్య చికిత్స విజయవంతమైందా? లేక మందులు పని చేశాయా? అనే విషయాన్ని నివేదిక అందిన తరువాతే స్పష్టం చేస్తామని అధికారులు వెల్లడించారు.