Coronavirus: ఢాం....ఢాం అని కొడుకు పెళ్లి చేసిన ఎమ్మెల్యే, కట్నంగా కరోనాను తెచ్చుకున్నాడు, పాపం !
బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ఎప్పుడు ఏ చేదువార్త వినాలో అని ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల కొడుకు పెళ్లి ఢాం.. ఢాం... అంటూ ఆర్బాటంగా చేసి లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని క్రిమినల్ కేసు నమోదు కావడంతో విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేకి మరో కష్టం ఎదురైయ్యింది. సార్ మీకు కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ వైద్యులు చెప్పడంతో సదరు ఎమ్మెల్యే నెత్తిమీద పిడుగుపడినట్లు అయ్యింది. కొత్తగా పెళ్లి కావడంతో హ్యాపీగా సంసారం చెయ్యాలో ? లేక తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాలో అర్థం కాక పెళ్లి కొడుకు అయోమయంలో పడిపోయాడు. అన్నట్లు ఆ ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి మాజీ సీఎం, మాజీ హోమ్ మంత్రి, ప్రస్తుత ఆరోగ్య శాఖా మంత్రితో సహ అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కావడం విశేషం.
Coronavirus: ఎమ్మెల్యే కొడుకు పెళ్లి అదుర్స్, ఆల్ పార్టీ వీఐపీలు హాజరు, ఎఫ్ఐఆర్ తో బెదుర్స్, పాపం !
మాజీ మంత్రి, పవర్ ఫుల్ ఎమ్మెల్యే
కర్ణాటకలోని మైనింగ్ హబ్ అయిన బళ్లారి జిల్లాలోని హూవిన హడగలి నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) పీటీ. పరమేశ్వర్ నాయక్ కు చాలా ఫాలోయింగ్ ఉంది. గతంలో కర్ణాటక మంత్రిగా పని చేసిన పీటీ. పరమేశ్వర్ నాయక్ పవర్ ఫుల్ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన పీటీ. పరమేశ్వర్ నాయక్ కు ఎప్పుడు ఆయన అనుచరులు వెంట ఉంటారు.
గ్రాండ్ గా కొడుకు పెళ్లి
కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ కుమారుడు అవినాష్ రాజకీయాల్లో చురుకుగా ఉండటమే కాకుండా అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. జూన్ 15వ తేదీన బళ్లారి జిల్లాలోని సొంత గ్రామం అయిన లక్ష్మీపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ ఆయన కొడుకు అవినాశ్ పెళ్లిని చాలా గ్రాండ్ గా ఢాం... ఢాం అంటూ చేశారు.
లాక్ డౌన్ దెబ్బకు క్రిమినల్ కేసు
ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ కొడుకు అవినాష్ పెళ్లికి కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, ప్రస్తుత ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములుతో సహ పార్టీలకు అతీతంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరైనారు. లాక్ డౌన్ సందర్బంగా 50 మంది కంటే ఎక్కువ మంది పెళ్లికి హాజరుకాకూడదని కేంద్ర ప్రభుత్వం షరతులు పెట్టినా పీటీ. పరమేశ్వర్ నాయక్ కొడుకు అవినాష్ పెళ్లికి కొన్ని వందల మంది హాజరైనారని వెలుగు చూడటంతో లక్ష్మీపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అప్పట్లో ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మీద కేసు నమోదు చెయ్యాలని స్వయంగా బళ్లారి జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ పోలీసు అధికారులకు సూచించారు,
సార్... మీకు కరోనా పాజిటివ్
ఓ పక్క కొడుకు పెళ్లితో కేసు నమోదు కావడంతో ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో తాము అన్ని నియమ నిబంధనలు పాటించి తన కొడుకు అవినాష్ పెళ్లి జరిపించామని, పెళ్లిలో భౌతికదూరం పాటించామని, ఎవ్వరికీ కరోనా వైరస్ రాదని ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ చెబుతూ వచ్చారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ కు వైద్యపరీక్షలు చేశారు. సార్ మీకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ కు చావుకబురు చల్లాగా చెప్పారు.
Recommended Video
పెళ్లి కొడుక్కి సినిమా కష్టాలు
గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్న అవినాష్ ఇప్పుడు అయోమయంలో పడిపోయాడు. హ్యాపీగా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యాలో, లేక తండ్రికి కరోనా పాజిటివ్ అని తెలిసి బాధపడాలో అర్థంకాక అవినాష్ ఆవేదన చెందుతున్నాడు. మొత్తం మీద పెళ్లి కొడుకు పెళ్లి చేసి సరిగ్గా నెల రోజులకే కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ కరోనా వ్యాధి బారినపడటంతో ఆయన వర్గీయులు హడలిపోతున్నారు.