Coronavirus Lockdown: రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టులో పెళ్లి, పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు !
బెంగళూరు/ ఊటీ: పెద్దలు ఎప్పుడో నిర్ణయించిన ముహుర్తానికి ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రంలో పెళ్లి చేసుకోవడానికి Coronavirus Lockdown అడ్డంకి అయ్యింది. పెళ్లి కొడుకును పక్క రాష్ట్రంలోకి పంపించడానికి పోలీసులు నిరాకరించడం, కనీసం పెళ్లి కూతురిని ఆ రాష్ట్రంలోకి పంపించడానికి కరోనా నియమాలు అడ్డంకి రావడంతో వారు తల్లడిల్లిపోయారు. వధూవరుల కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకున్న స్థానికులు చెక్ పోస్టులోనే అనుకున్న ముహూర్తానికి నవ దంపతులను ఒక్కటి చేశారు. పగవాళ్లకు కూడా ఇలాంటి కష్టాలు వద్దు దేవుడా అంటున్నారు నవ దంపతులు. ఫ్యాలెస్ లు, రిసార్టులు, కల్యాణమండపాలు, దేవాలయాలు, ఇళ్లలో పెళ్లి చేసిన విషయం మనకు తెలుసు. అయితే మొదటి సారి కరోనా లాక్ డౌన్ దెబ్బకు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చెక్ పోస్టులో పెళ్లి చెయ్యడం ఇంత వరకు తాము వినలేదని, చూడలేదని, ఇలా జరగడం ఇదే మొదటి సారి అని స్థానిక ప్రజలు అంటున్నారు..
Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !
కర్ణాటక అమ్మాయి, తమిళనాడు అబ్బాయి
కర్ణాటకలోని హాసన్ జిల్లా ఆలూరు తాలుకా ఎన్ఆర్. పుర గ్రామానికి చెందిన ఉషా, తమిళనాడులోని మెట్టూరులోని కార్కాడ్ గ్రామానికి చెందిన అరవింద్ లు దూరపు బంధువులు. ఉషా, అరవింద్ ల వివాహం కర్ణాటకలోని ధర్మస్థలంలో ఎలాంటి అడంభరాలు లేకుండా సింపుల్ గా చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు చాలా రోజుల క్రితమే నిర్ణయించారు.
వరుడిని అడ్డుకున్న కర్ణాటక పోలీసులు
ప్రసిద్ది చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలంలో ఉషాను వివాహం చేసుకోవడానికి అరవింద్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు బయలుదేరారు. అయితే కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా ఒక రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీలులేదని కర్ణాటక పోలీసులు అరవింద్ కుటుంబ సభ్యులను చామరాజనగర జిల్లాలోని పుణజనూరు అంతరాష్ట్ర చెక్ పోస్టులో అడ్డుకున్నారు.
చచ్చినా వదిలిపెట్టం !
వరుడు అరవింద్ కుటుంబ సభ్యులను అంతరాష్ట్ర పుణజనూరు చెక్ పోస్టులో అడ్డుకున్నారని సమాచారం తెలుసుకున్న ఉషా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. వరుడు అరవింద్ కుటుంబ సభ్యులు రావడానికి అనుమతి ఇవ్వాలని, ధర్మస్థలంలో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఉషా కుటుంబ సభ్యులు కర్ణాటక పోలీసులను ప్రాదేయపడ్డారు. అయితే ఇలాంటి సమయంలో తమిళనాడు ప్రజలను కర్ణాటకలోకి అనుమతింతమని చెక్ పోస్టులోని కర్ణాటక పోలీసులు తేల్చి చెప్పారు.
మేమేం తక్కువ తిన్నాం చెప్పండి ?
కర్ణాటక పోలీసులు చెక్ పోస్టులో మొండిగా వ్యవహరించడంతో కనీసం మమ్మల్ని తమిళనాడులోకి వెళ్లడానికి అనుమతి ఇస్తే అక్కడే ఎదో ఒక దేవాలయంలో పెళ్లి చేసుకుంటామని ఉషా కుటుంబ సభ్యులు తమిళనాడు పోలీసులకు మనవి చేశారు. అయితే కర్ణాటక ప్రజలను తమిళనాడులోకి అనుమతించమని, లాక్ డౌన్ నియమాలు అమలులో ఉన్నాయని, కర్ణాటక పోలీసుల కంటే మేమేం తక్కువ తిన్నాం అని తమిళనాడు పోలీసులు మొండికేశారు.
మంత్రికి సమాచారం
తమిళనాడు- కర్ణాటక పోలీసులు వధూవరులను ఏ రాష్ట్రంలోకి పంపించడానికి నిరాకరించడంతో రాత్రి మొత్తం ఇరు కుటుంబ సభ్యులు చెక్ పోస్టులోనే కాలం గడిపాడు. వధూవరులు ఉషా, అరవింద్ కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకున్న స్థానిక నాయకులు చామరాజనగర జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సురేష్ కుమార్ కు సమాచారం ఇచ్చారు.
చెక్ పోస్టులో చకచకా పెళ్లి
మంత్రి సురేష్ కుమార్ కూడా అక్కడే ఎదైనా దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని, ధర్మస్థలం వెళ్లడానికి లాక్ డౌన్ నియమాలు అంగీకరించవని చెప్పారని తెలిసింది. వధూవరులు ఉషా, అరవింద్ కుటుంబ సభ్యుల భాదను చూసి చలించిపోయిన పుణజనూరు, బాణహళ్ళి చెక్ పోస్టు పరిసర ప్రాంతాల ప్రజలు వారే పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. వధూవరులు ఉషా, అరవింద్ లను బాణహళ్ళి చెక్ పోస్టు సమీపంలోని శ్రీ గణపతి దేవాలయంలో సింపుల్ గా చకచకా పెళ్లి చేశారు.
ఇలాంటి కష్టాలు పగవాళ్లకు వద్దు దేవుడా !
పెళ్లి చేసిన స్థానికులకు కనీసం భోజనాలు పెట్టడానికి అవకాశం లేకపోవడంతో నవ దంపతులు ఉషా, అరవింద్ కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి పెళ్లి కష్టాలు పగవారికి కూడా వద్దు దేవుడా అంటూ నవ దంపతులు విలపించారు. విషయం అర్థం చేసుకున్న స్థానికులే వారి ఇళ్లలో భోజనాలు చేయించి వధూవరుల కుటుంబ సభ్యులకు వడ్డించారు. తరువాత వధువు ఉషా పుట్టింటికి, అరవింద్ తమిళనాడులోని ఇంటికి వెళ్లిపోయారు. మొత్తం మీద లాక్ డౌన్ పుణ్యమా అంటూ చెక్ పోస్టులో పెళ్లి చేసుకున్న ఉషా, అరవింద్ దంపతులు ఈ విషయం జీవితాంతం మరిచిపోలేరని స్థానికులు అంటున్నారు.