Lockdown: నా కొడుకు పెళ్లి ఎలా చేశామంటే ? మాజీ సీఎం, మాకు కరోనా వస్తే వీళ్లే కారణం, బీజేపీ లీడర్ !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి తన కుమారుడు, ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు నిఖిల్ వివాహం నిరాడంబరంగా జరిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ తన సొంత జిల్లా రామనగరలో లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆయన మనుమడు నిఖిల్ వివాహం చెయ్యాలని మొదట భావించారు. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అదిసాధ్యం కాలేదు. కొడుకు నిఖిల్ పెళ్లి జరిపించిన మాజీ సీఎం కుమారస్వామి భావోద్వేగానికి గురైనారు. కరోనా వైరస్ లేకుంటే తన కుమారుడి పెళ్లి ఎంతో వైభవంగా అభిమానుల సమక్షంలో జరిపించేవారమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. అయితే కరోనా గ్రీన్ జోన్ గా ఉన్న రామనగర జిల్లాలో ఇక ముందు ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనా దానికి మాజీ సీఎం కుమారస్వామి కుటుంబ సభ్యులే కారణం అవుతారని ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రుద్రేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!
కరోనా రెడ్ జోన్ టూ గ్రీన్ జోన్
బెంగళూరు కరోనా రెడ్ జోన్ గా ప్రకటించడంతో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ వివాహం రామనగర జిల్లాలోని కేతగానహళ్ళిలోని సొంత ఫాం హౌస్ లో జరిపించాలని చివరి నిమిషంలో నిర్ణయించారు. రామనగర్ కరోనా గ్రీన్ జోన్ కావడంతో నిఖిల్ వివాహానికి అడ్డంకులు తొలగిపోయాయి.
నా కలలు తారుమారైనాయి
పిల్లల పెళ్లిళ్లు వైభంగా చెయ్యాలని ఏ తల్లిదండ్రులు అయినా అనుకుంటారు. అయితే తన కుమారుడు నిఖిల్ వివాహం విషయంలో తన కలలు తారుమారైనాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి భావోద్వేగానికి గురైనారు. ఇదే విషయంపై మాజీ సీఎం కుమారస్వామి జేడీఎస్ నాయకులు, కార్యకర్తలకు, ఆయన అభిమానులు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. రామనగర- చెన్నపట్టణ మార్గం మధ్యలో తన కుమారుడు నిఖిల్ వివాహం లక్షల మంది అభిమానుల సమక్షంలో చెయ్యాలని అనుకున్నామని, అయితే కరోనా వైరస్ కారణంగా ఆ ఆశలు కలగానే మిగిలిపోయాయని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు.
మీకు రుణపడి ఉంటాను
తన కుమారుడు నిఖిల్, రేవతిల వివాహం నిరాడంబరంగా జరిపించామని, ఈ వివాహం జరుగుతున్న ఫాం హౌస్ దగ్గరకు ఎవ్వరూ రాకూడదని, ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కు దూరంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, తన విన్నపాన్ని అర్థం చేసుకుని ఎవ్వరూ వివాహం జరుగుతున్న ఫాం హౌస్ దగ్గరకు రాలేదని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని మాజీ సీఎం కుమారస్వామి భావోద్వేగంతో అన్నారు. ఇదే సమయంలో తనను, తన కుటుంబ సభ్యుల పరిస్థితిని పెద్ద మనసుతో అర్థం చేసుకున్న కార్యకర్తలకు, అభిమానులకు మాజీ సీఎం కుమారస్వామి కృతజ్ఞతలు చెప్పారు.
ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్యకర్తలు
నిఖిల్ వివాహానికి దూరంగా ఉండాలని, ఆయన్ను మీ ఇళ్ల నుంచే ఆశీర్వదించాలని తాను, తన కుటుంబ సభ్యులు చేసిన మనవికి కట్టుబడి ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జేడీఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి కృతజ్ఞతలు చెప్పారు. కరోనా వైరస్ పూర్తిగా కట్టడి అయిన తరువాత గ్రాండ్ గా అందరికీ పెద్ద ఎత్తున విందు ఇస్తామని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి తెలిపారు.
ఎలా వచ్చారో ఎవరికి తెలుసు ?
రామనగర జిల్లాలో ఇంత వరకు కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రుద్రేష్ గుర్తు చేశారు. బెంగళూరులో కరోనా వైరస్ కేసులు ఎక్కువ కావడంతో ఆ నగరం రెడ్ జోన్ లో ఉందని రుద్రేష్ చెప్పారు. కరోనా వైరస్ రెడ్ జోన్ నుంచి మాజీ సీఎం కుమారస్వామి కుటుంబ సభ్యులు కార్లు, అనేక వాహనాల్లో రామనగర జిల్లాకు వచ్చారని, వారు ఎలా కేతగానహళ్ళి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారో ఎవ్వరికీ తెలియడం లేదని బీజేపీ నాయకుడు రుద్రేష్ అన్నారు.
మాకు కరోనా వస్తే మాజీ సీఎం ఫ్యామిలీనే కారణం
రామనగర జిల్లాలో ఒకవేళ ఒక్క కరోనా వైరస్ కేసు నమోదైనా దానికి మాజీ సీఎం కుమారస్వామి కుటుంబ సభ్యులే కారణం అవుతారని ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రుద్రేష్ ఆరోపించారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి బెంగళూరు నుంచి భారీ సంఖ్యలో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుటుంబ సభ్యులు రామనగర జిల్లాలో అడుగు పెట్టి ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు అయిన నిఖిల్, రేవతిల వివాహం జరిపించారని ఆరోపణలు ఉన్నాయి.